సాయి పల్లవి ఒక అద్భుతమైన నటి అని, అయితే తులసీదాస్ రామాయణంలో చెప్పినట్టు సీతకు 'బాదాం కళ్లు' ఉండాలని పాత రామాయణం సీత దీపికా చిఖ్లియా అన్నారు. సాయి పల్లవి గెటప్‌ను చూసిన తర్వాతే ఆమె ఆ పాత్రకు ఎంతవరకు సరిపోతుందో చెప్పగలనని తెలిపారు.

భారీ కాస్టింగ్‌తో రాబోతున్న రామాయణ్‌

ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న సినిమాల్లో `రామాయణ్‌` ఒకటి. నితేష్ తివారీ డైరెక్షన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా మన 'రాఖీ భాయ్' యశ్ నటిస్తుండగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనుంది. అయితే, ఇప్పటికీ దేశవ్యాప్తంగా 'సీత' అనగానే అందరికీ గుర్తొచ్చేది రామానంద్ సాగర్ రామాయణంలోని దీపికా చిఖ్లియానే. మరి ఈ కొత్త సీత గురించి పాత సీత ఆసక్తికర కామెంట్‌ చేశారు. 

 సాయి పల్లవి నటనకు తిరుగులేదు, కానీ… 

 ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీపికా చిఖ్లియా, సాయి పల్లవి గురించి మనసు విప్పి మాట్లాడారు. `సాయి పల్లవి ఒక అద్భుతమైన నటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె నటనను నేను చూశాను, నిజంగా ప్రశంసించదగినది` అని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ, అసలు విషయం ఇక్కడే మొదలైంది. సీత పాత్రకు ఒక ప్రత్యేకమైన కళ ఉండాలని దీపిక అభిప్రాయపడ్డారు. `తులసీదాస్ రామాయణంలో సీత అందాన్ని వివరిస్తూ 'బాదాం కళ్ల సుందరి' అని వర్ణించారు. అప్పట్లో రామానంద్ సాగర్ గారు నాలో ఆ లక్షణాలను చూశారు. సాయి పల్లవి సీత గెటప్‌లో ఎలా కనిపిస్తుందో మనకు ఇంకా తెలియదు. ఆ సినిమా ఫస్ట్ లుక్ చూశాకే, ఆమె ఆ పాత్రకు ఎంత న్యాయం చేసిందో చెప్పగలం` అంటూ దీపిక కాస్త సస్పెన్స్ మెయింటైన్ చేశారు. 

 పాత రామాయణం క్రేజ్ తగ్గదు!

 ఈ సందర్భంగా దీపిక ఒక ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. "చాలామంది నన్ను దీపిక అని కాకుండా సీత అనే పిలుస్తారు. అది నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పటి తరం వాళ్లు కూడా దూరదర్శన్‌లో వచ్చిన పాత రామాయణాన్నే ఇష్టపడుతున్నారు. కాబట్టి, కొత్త సినిమా ఎంత అద్భుతంగా వచ్చినా, ఆ పాత జ్ఞాపకాలను చెరిపేయడం అంత సులభం కాదు` అని అన్నారు. అప్పట్లో రాముడిగా మెప్పించిన అరుణ్ గోవిల్, ఇప్పుడు ఈ కొత్త సినిమాలో దశరథుడిగా నటిస్తుండటం విశేషం! 

 4,000 కోట్ల భారీ బడ్జెట్! 

నితేష్ తివారీ తీస్తున్న ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 4,000 కోట్ల రూపాయలు. దీంతో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా ఇది నిలవనుంది. ఈ చిత్రంలో హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబే, కైకేయిగా లారా దత్తా నటిస్తున్నారు. ఈ మహా కావ్యం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. మరి, దీపికా చిఖ్లియా సృష్టించిన ఆ ఐకానిక్ ఇమేజ్‌ను సాయి పల్లవి దాటగలదా? కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్‌ నేడు విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది.