భారత్ లో జరిగిన ఉగ్ర దాడులు అన్నింటిలో పాక్ హస్తం: పవన్ కళ్యాణ్ | Operation Sindoor | Asianet Telugu
భారత దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి దాడులకు పాల్పడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 1947లో దేశ విభజన జరిగిన నాటి నుంచి దేశం ఏనాడు ప్రశాంతత చూసింది లేదన్నారు. శాంతి.. శాంతి అంటూ వల్లించే శాంతి వచనాలు వారికి పని చేయవన్నారు. ఇప్పటి వరకు సహనంతో మా చేతులు కట్టేశారని.. ఇక పాకిస్థాన్ ఆటలు సాగవన్నారు. మీరు మా దేశంలోకి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి వచ్చి కొడతామని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ విజయానికి మద్దతుగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జాతీయ జెండా చేతబూని రెపరెపలాడిస్తూ సూమారు మూడు కిలోమీటర్లు నడిచారు. ఆద్యంతం జాతీయ భావం వెల్లివిరియగా.. వేలాది మంది నగర ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని భారత సైన్యం తాలూకు శౌర్యాన్ని కీర్తించారు. భారత్ మాతా కీ జై అని నినదిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముందుకి కదలగా.. వేలాది మంది జాతీయ పతాకాలు చేతబూని వారిని అనుసరించారు. బెంజి సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "దేశ విభజన జరిగిన నాటి నుంచి మనం ఏనాడు ప్రశాంతత చూడలేదు. కసబ్ లాంటి తీవ్రవాదులు దేశంలోకి చొరబడి 72 గంటల పాటు ఎలాంటి దాడులు చేశారో చూశాం. ముంబయి పేలుళ్లు, కోయంబత్తూరు పేలుళ్లు, గోకుల్ చాట్ పేలుళ్లు, జామా మసీదు పేలుళ్లు, లుంబనీపార్కు పేలుళ్లు వీటన్నింటి వెనుక పాకిస్థాన్ హస్తం ఉంది" అని అన్నారు.