Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ తల్లి విగ్రహాలు కూలగొడ్దామా?

  • ఎవని తల్లి అని మాట్లాడి ఇప్పుడు సభల పేరుతో డ్రామాలా?
  • పుంటికూర స‌భ‌లా.. గొంగుర స‌భ‌లా చెప్పాలి
  • మా తెలుగు త‌ల్లికి మ‌ల్లెపూల దండ పాట పాడుతారా?
  • జ‌య జ‌య‌హే తెలంగాణ‌.. జ‌న‌నీ జ‌య కేత‌నం పాడుత‌రా?
  • అందెశ్రీ‌ని, గ‌ద్ద‌ర్‌ను, విమలక్కను, జయధీర్ తిరుమల  రావు వస్తారా?
World Telugu Conference is more a publicity stunt than cultural event

ప్ర‌పంచ మ‌హా స‌భ‌ల పేరుతో హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వం మ‌రో ఇవేంట్‌కు వేదిక చేసింద‌నని విమర్శించారు. ప్ర‌భుత్వం ప‌రిపాల‌న చేయ‌డం మానేసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తుంద‌న్నారు. అందుకే 50 కోట్ల ప్ర‌జాధ‌నంతో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హిస్తుంద‌ని దాసోజు విమ‌ర్శించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ సాహిత్యానికి, సంస్కృతికి అవ‌మానం జ‌రుగుతుంద‌ని, తెలంగాణ వేరు, తెలుగు వేరు అని నినాదాలు చేసి ఉద్య‌మాలు చేశారని అన్నారు. తెలుగు త‌ల్లి ఎవ‌డి త‌ల్లి తెలంగాణ బిడ్డ‌ల‌ను ఆదుకుందా.. మా కన్నీరు కారితే తుడిచిందా, తెలుగు త‌ల్లి కాదు ద‌య్యం, దిక్కుమాలిన త‌ల్లి అంటు అవ‌హేళ‌న చేసిన టిఆర్ ఎస్ నాయ‌కులు ఇప్ప‌డు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు అంటు మ‌రో ఇవేంట్ నిర్వ‌హించి హంగామాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.

నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు నీరు రాక‌పోతే తెలుగు త‌ల్లికి ఎందుకు క‌న్నీరు రావ‌డం లేద‌ని, మూడు వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే తెలుగు త‌ల్లి ఎందుకు ఏడ్వ‌లేద‌ని అన్న కేసిఆర్ ఇప్పుడు ఎలా తెలుగు మ‌హాస‌భ‌ల పేరిట తెలుగు త‌ల్లిని పూజిస్తార‌ని, తెలుగు వేరు, తెలంగాణ వేరు అని, తెలుగు భాష వేరు,  తెలంగాణ భాష వేరు అని తెలుగును అనేక ర‌కాలుగా తూల‌నాడి  తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల‌ను రూపొందించి ఊరూర పెట్టిన ఆ విగ్ర‌హాల‌ను ఏమి చేద్దాం అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాలు  కూల్చివేద్దామా అని ఆయ‌న అన్నారు. కేసిఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, ప‌దువులు ఇవ్వ‌క మోసం  చేస్తు ఉద్య‌మ కారులు ఇలా వేలాది మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే తెలంగాణ త‌ల్లి త‌ల్ల‌డిల్లిపోతుంద‌ని ఆమె గుండె అల్ల క‌ల్లోలం అవుతుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

గ‌తంలో తెలంగాణ వేరు, తెలుగు వేరు అని చెప్ప‌డానికి కేసిఆర్ అనేక సంద‌ర్భాల‌లో ఆన‌ప‌కాయ అంటే తెలంగాణ‌ సొర‌కాయ అంటే ఆంధ్రా, పుంటికూర అంటే తెలంగాణ‌, గొంగూర అంటే ఆంధ్రా అని భాష్యం చెప్పార‌ని గుర్తు చేశారు. మ‌రి ఇప్ప‌డు హైద‌రాబాద్‌లో జ‌ర‌గుతున్న తెలుగు మ‌హాస‌భ‌లు పుంటికూర స‌భ‌లా, గొంగూర స‌భ‌లా, ఆన‌ప‌కాయ స‌భ‌లా, సోర‌కాయ స‌భ‌లా తేల్చి చెప్పాలన్నారు. ఈ స‌భ‌ల‌లో ప్రారంభ పాట‌లో మా తెలుగు త‌ల్లికి మ‌ల్లే పూ దండ అనే పాట పాడుతారా, జ‌య జ‌య‌హే తెలంగాణ జ‌న‌నీ జ‌య కేతనం అనే తెలంగాణ పాట పాడుతారా స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న కేసిఆర్‌ను నిల‌దీశారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హిస్తూ ఎక్క‌డో అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్న క‌వులు, క‌ళాకారులు, సాహితీ వేత్త‌ల‌కు వెండి ప‌ల్లెల‌లో ఆహ్వ‌నాలు పంపుతున్న ప్ర‌భుత్వం ఇక్క‌డే ఉన్న తెలంగాణ ప్ర‌ఖ్యాత క‌ళాకారులు, క‌వులు, ర‌చ‌యిత‌లు, తెలంగాణ బిడ్డ‌లు, తెలంగాణ సాహిత్యాన్ని, సాంప్ర‌దాయాన్ని అనువ‌నువునా జీర్ణించుకున్న గ‌ద్ద‌ర్‌, అందెశ్రీ‌, విమ‌ల‌క్క‌, గోరేటి వెంక‌న్న లాంటి వాళ్ళ‌ను మ‌రిచిపోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.

అందెశ్రీ కేసిఆర్‌ను పొగుడుతూ పాట‌లు పాడ‌డం లేద‌ని అందుకే ఆయ‌న‌ను ప‌ట్టించ‌కోవ‌డం లేద‌న్నారు.  ఆయ‌న ఆత్మ గౌర‌వంతో బ‌తుకుతూ గొప్ప క‌విగా ఎద‌గ‌డం వ‌ల్ల నే నేడు కేసిఆర్ ఇలాంటి ఈవెంట్ల‌కు అందెశ్రీ‌ని దూరం పెట్టార‌ని, జ‌య జ‌య‌హే తెలంగాణ జ‌న‌నీ జ‌య కేతనం, ముక్కొటి గొంతుక‌లు ఒక్క‌టైన కేత‌నం అనే పాట‌ను గ‌తంలో అధికారిక పాట‌గా రోజు పాఠ‌శాల‌లో పాడిస్తామ‌ని చెప్పిన కేసిఆర్ ఎందుకు అలా నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నేడు తెలుగు మ‌హాస‌భ‌ల‌లో అందెశ్రీ లేరు, జ‌య శంక‌ర్ సార్ లేరు, కాళోజీ నారాయ‌ణ రావు ఆలోచ‌న‌లు లేవు. ఇప్ప‌డు ద‌ళిత‌, బ‌హుజ‌న క‌వులు, క‌ళాకారుల‌ను ప‌క్క‌న పెట్టి నందిని సిద్దారెడ్డి, ర‌మాణాచారి, క‌విత‌, ఆయాచితం శ్రీ‌ద‌ర్‌లు నిర్వాహ‌న క‌మిటీలో ఉండ‌డం బాధ‌క‌ర‌ణ‌మ‌ని ఆయ‌న అన్నారు.

2012లో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌రిగిన‌పుడు తెలంగాణ‌కు అవ‌మానం అని చిలుక‌ప‌లుకులు ప‌లికిన నాయ‌కులు ఇప్ప‌డు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న పెట్టేందుకు ప్ర‌జ‌లను మ‌భ్య‌పెట్టేందుకు ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ఇలాంటి ఇవేంట్ల‌ను చేస్తూ కోట్లాది రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. స‌బ్బండ వ‌ర్గాలు, స‌క‌ల జ‌నులు ఉద్య‌మం చేస్తే వంద‌లాది మంది ఆత్మ‌బ‌లిదానాలు చేస్తే తెలంగాణ క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, మేధావులు, ఉద్య‌మ కారులు గొంతెత్తి నినాదాలు చేస్తే, పాట‌లు పాడితే, కాళ్ళ‌కు గ‌జ్జెలు క‌ట్టి ఆడితే తెలంగాణ వ‌చ్చింది. సోనియాగాంధీ సంక‌ల్ప బ‌ల‌మే తెలంగాణకు నాంది ప‌లికింది. అలాంటి వారినంద‌రికీ ప‌క్క‌న పెట్టి నేడు తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

రాజ‌కీయంగా నష్ట‌పోయి క‌డుపు కోసుకొని తెలంగాణ ఇచ్చిన త్యాగ‌శీలి సోనియాగాంధీ పేరు లేకుండా తెలంగాణ‌లో తెలుగు మ‌హాస‌భ‌లు ఎలా నిర్వ‌హిస్తార‌ని అన్నారు. అందెశ్రీ‌ని గౌర‌వించ‌కుండా, గ‌ద్ద‌ర్ ను ఆదరించ‌కుండా, విమ‌ల‌క్క‌ను పిల‌వ‌కుండా, గోరేటిని ఆహ్వ‌నించ‌కుండా తెలంగాణ‌లో మ‌హాస‌భ‌లు ఎలా నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న అన్నారు. వీరంద‌రితోపాటు బ‌హుజ‌న‌, స‌బ్బండ వ‌ర్గాల సాహిత్యాలను, క‌ళ‌ల‌ను ఆద‌రించి వారిని పెద్ద ఎత్తున గౌర‌వించాల‌ని, వారిని స‌న్మానించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

తెలుగు యూనివర్సిటీ కి నిధులు కేటాయించలేదు, తెలుగు అకాడెమీ ని విస్మరించి వందల కోట్లు ఖర్చు పెట్టి వ్యక్తిగత ప్రాభల్యం పెంచుకువటం కొరకు ప్రజా ధనం

ఖర్చు చేయడం నేరం. తెలుగు సభలు జరిపే రాష్ట్రంలో తెలుగు లో జీవో లు ఉండకపోవడం బాష పట్ల కెసిఆర్ చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios