ఎర్రవల్లి ఫాంహౌస్ లో కాలుజారిపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆయనను కలిసేందుకు వెళ్లే పల్లా ప్రమాదవశాత్తు గాయపడ్డారు. 

Palla Rajeshwar Reddy : మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ కోసం ఏర్పాటుచేసిన జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ ముందు ఇవాళ(బుధవారం) మాజీ సీఎం కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. దీంతో విచారణకంటే ముందే బిఆర్ఎస్ సీనియర్ నాయకులంతా కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇలా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా అందరు నాయకులతోపాటు కేసీఆర్ ను కలిసేందుకు ఫాంహౌస్ కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ బాత్రూంలో ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. తీవ్ర గాయం కావడంతో నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. ఆయన ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు... ఆయన స్వల్పంగా గాయపడినట్లు వైద్యులు చెబుతున్నారు.

అయితే కాళేశ్వరం కమీషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్ అక్కడినుండి నేరుగా యశోద హాస్పిటల్ కు వెళ్లారు. ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన ఆయన వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ వైద్యులకు సూచించారు. పల్లాతో పాటు ఆయన కుటుంబసభ్యులకు కేసీఆర్ దైర్యం చెప్పారు.

Scroll to load tweet…

కేసీఆర్ వెంట కాళేశ్వరం కమీషన్ విచారణకు వెళ్లిన హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జోగినిపల్లి సంతోష్ తదితర నాయకులంతా పల్లాను పరామర్శించారు. అంతకుముందు తండ్రి కేసీఆర్ ను ఫాంహౌస్ లో కలిసిన కవిత కూడా నేరుగా హైదరాబాద్ కు వచ్చి పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు.

గతంలో ఇదే ఎర్రవల్లి ఫాంహౌస్ లో సేమ్ ట సేమ్ ఇలాగే కేసీఆర్ కూడా జారిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంటే 2023 డిసెంబర్ లో ఆయన ఫాంహౌస్ బాత్రూంలో జారిపడటంతో తుంటి ఎముక విరిగి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇదే హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు... సర్జరీ తర్వాత చాలారోజులకు ఆయన కోలుకున్నారు. ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా బాత్రూంలో జారిపడ్డారు... కానీ ఆయనకు సీరియస్ గా గాయాలేవీ కానట్లు తెలుస్తోంది.