Asianet News TeluguAsianet News Telugu

టీసీఎస్‌కు తప్పని కరోనా కష్టాలు..భారీగా తగ్గిన లాభాలు

టీసీఎస్‌ లాభాలకు కరోనా కత్తెర పడింది. తొలి త్రైమాసికం లాభాలు 13.8 శాతం క్షీణించి, రూ.7,008 కోట్లకు పరిమితమయ్యాయి. సంస్థ  ఆదాయం రూ.38,322 కోట్లకు చేరుకున్నది. వాటాదారులకు  రూ.5 మధ్యంతర డివిడెండ్‌ చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. 

tcs net profit dips nearly 14% to 7008 crore in q1 misses estimates
Author
Hyderabad, First Published Jul 10, 2020, 11:31 AM IST

ముంబై: కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ ప్రభావితం దేశీయ కార్పొరేట్‌ రంగంలో త్రైమాసిక ఫలితాలపై పడింది. ఈ సీజన్‌లో బోణీ చేసిన టీసీఎస్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలకు తగినట్లే నిరాశాజనకంగానే నమోదయ్యాయి. గత మూడు నెలల్లో కంపెనీ ఆర్థిక పనితీరుపై కరోనా సంక్షోభం స్పష్టమైన ప్రభావం చూపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంో టీసీఎస్‌ నికర లాభం 13.8 శాతం తగ్గి రూ.7,008 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.8,131 కోట్లుగా నమోదైంది.

సమీక్షా కాలంలో టీసీఎస్‌ ఆదాయం రూ.38,322 కోట్లకు పరిమితమైంది. అంతకు ఏడాది క్రితం ఆర్జించిన  రూ.38,172 కోట్ల రాబడితో పోలిస్తే 0.4 శాతం వృద్ధి చెందింది. కరోనా సంక్షోభంతో ప్రపంచ దేశాల వ్యాపారాలన్నీ ప్రభావితమయ్యాయి. 


ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ దేశీయ ఐటీ కంపెనీలపై కరోనా ప్రభావం కొంత మేర కన్పించింది. ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంపైన మాత్రం ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటుందని ఐటీ కంపెనీలు ముందే అంచనా వేశాయి. టీసీఎస్‌ తాజా ఆర్థిక గణాంకాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

స్థిర కరెన్సీ విలువ ప్రకారం, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ఆదాయం 6.3 శాతం క్షీణించింది. వడ్డీలు, పన్నులు చెల్లించక ముందు నమోదైన స్థూల లాభం రూ.9,048 కోట్లు. కాగా, స్థూల లాభం మార్జిన్‌ 23.6 శాతంగా ఉంది 

also read ఇక దేశవ్యాప్తంగా రిలయన్స్- బీపీ బంకులు.. త్వరలో జియోబీపీగా రీ-బ్రాండింగ్‌.. ...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు ఒక్కో షేర్‌పై రూ.5 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. ఈ మార్చి 31 నాటికి 4,48,464గా నమోదైన కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య జూన్‌ 30 నాటికి 4,43,676కు తగ్గింది. 

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో టీసీఎస్‌ 690 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. జనవరి-మార్చిలో కుదుర్చుకున్న 890 కోట్ల డాలర్ల డీల్స్‌తో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. 

ప్రస్తుతం ఒక శాతం సిబ్బంది మాత్రమే కంపెనీకి చెందిన ఆయా కార్యాలయాల నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌) పని చేస్తున్నారని టీసీఎస్‌ పేర్కొన్నది. ప్రస్తుత త్రైమాసికంలో ఈ వాటాను క్రమంగా పెంచుతామని తెలిపింది. 

విదేశీ విద్యార్థులను వెళ్లగొట్టడం అమెరికాకే నష్టమని టీసీఎస్‌ మానవ వనరుల విభాగ గ్లోబల్‌ హెడ్‌ మిలింద్‌ లక్కడ్‌ అన్నారు. అక్కడి విశ్వవిద్యాలయాల్లో పట్టాలు పుచ్చుకున్న ప్రతిభావంతులపై ఆధారపడుతున్న అమెరికా టెక్నాలజీ దిగ్గజాలకు దీర్ఘకాలంలో  ఇది సవాలుగా పరిణమించనుందన్నారు. 

అమెరికాలో టెక్నాలజీ అభివృద్ధిపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని టీసీఎస్‌ మానవ వనరుల విభాగ గ్లోబల్‌ హెడ్‌ మిలింద్‌ లక్కడ్‌ హెచ్చరించారు. సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్‌1-బీ వీసాలను నిలిపివేయడం దురదృష్టకరమని, అనుచిత నిర్ణయమని మిలింద్‌ పేర్కొన్నారు.

త్రైమాసిక ప్రారంభంలో అంచనా వేసినట్లుగానే కరోనా సంక్షోభం కంపెనీకి చెందిన అన్ని విభాగ సేవలపై ప్రభావం చూపిందని టీసీఎస్ ఎండీ కం సీఈఓ రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. మెరుగైన వృద్ధి నమోదు చేసుకోగల లైఫ్‌సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మాత్రం ఇందుకు మినహాయింపు అని చెప్పారు. కరోనా ప్రభావం దాదాపు ముగిసినట్లేనని కంపెనీ భావిస్తోందని, మళ్లీ వృద్ధి పథాన్ని వెతకడం ప్రారంభించాలని టీసీఎస్ ఎండీ కం సీఈఓ రాజేష్‌ గోపీనాథన్‌ వ్యాఖ్యానించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios