Ind vs Zim: ఇండియాను జింబాబ్వే చిత్తుగా ఓడిస్తే.. అతడిని పెళ్లాడుతా: పాకిస్తాన్ నటి ఆఫర్
ఇండియా, జింబాబ్వే మ్యాచ్ గురించి పాకిస్తాన్ నటి చేసిన ట్వీట్ నెట్టింట్లో రచ్చ చేస్తున్నది. టీమిండియాను జింబాబ్వే ఓడిస్తే తాను జింబాబ్వే పౌరుడిని పెళ్లి చేసుకుంటా అంటూ.. భారత టీమ్ పై ఉన్న కసిని వెళ్లగక్కారు.
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విధ్వంస బ్యాటింగ్తో పాకిస్తాన్ను నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఓడించిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా యావత్ భారత్ ఈ మ్యాచ్ను ఎంజాయ్ చేసింది. కానీ, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు మాత్రం అదొక పీడకలగా మారినట్టు తెలుస్తున్నది. అది కాస్తా ఇండియాను ఓడించాలనే పట్టుదల నుంచి ఎవరు అయినా సరే టీమిండియాను ఓడించాలనే నైరాశ్యంలోకి కొందరు పాకిస్తానీయులు జారిపోయినట్టు అవగతమవుతున్నది. ఇందుకు తాజా ఉదాహరణ పాకిస్తాన్ నటి సెహర షిన్వారీ ట్వీట్.
టీ20 వరల్డ్ కప్ 2022 సిరీస్లో నవంబర్ 6వ తేదీన భారత్ జింబాబ్వే టీమ్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియాను జింబాబ్వే చిత్తుగా ఓడించాలని పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ కలలు గంటున్నారు. అంతేకాదు.. జరిగే అంటూ ఓ ఆఫర్ ప్రకటించారు. ‘నెక్స్ట్ మ్యాచ్లో ఇండియాను జింబాబ్వే అద్భుతంగా ఢీకొట్టి ఓడిస్తే.. నేను జింబాబ్బే పౌరుడిని పెళ్లి చేసుకుంటా’ అంటూ ట్వీట్ చేశారు. ఈ కామెంట్ తర్వాత ఓ ఎమోజీ కూడా పెట్టారు.
ఈ ట్వీట్ నెట్టింట్లో రచ్చ చేసింది. క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా టీమిండియా అభిమానులు ఈ నటిపై విరుచుకుపడ్డారు. అలాగైతే.. మీకు పెళ్లి జరిగే అవకాశాలు కనిపించట్లేవని కొందరు వ్యంగ్యంగా ట్వీట్ చేస్తే.. మరికొందరు స్టాట్స్ ముందుకు తెచ్చారు. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలోనూ ఆమె అంచనాలు తలకిందులయ్యాయని గుర్తు చేశారు. అలాగైతే.. జీవితమంతా పెళ్లి చేసుకుండానే ఒంటరిగా ఎలా ఉంటారో పాపం అంటూ ట్వీట్ చేశారు.