ఆటో దిగ్గజాలకు షాక్: బైక్స్ సేల్స్ ‘మిక్చర్ పొట్లం’
ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు కలిసిరాలేదు. మారుతీ సుజుకీ, హ్యుండాయ్ సంస్థలకు వాహనాల కొనుగోలు దారులు గట్టి షాక్ ఇచ్చారు. మారుతి సుజుకి సేల్స్ 18.7 శాతం, హ్యుండాయ్ కార్ల విక్రయాలు 10.1 శాతం పడిపోయాయి.
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు కలిసిరాలేదు. మారుతీ సుజుకీ, హ్యుండాయ్ సంస్థలకు వాహనాల కొనుగోలు దారులు గట్టి షాక్ ఇచ్చారు. మారుతి సుజుకి సేల్స్ 18.7 శాతం, హ్యుండాయ్ కార్ల విక్రయాలు 10.1 శాతం పడిపోయాయి.
హోండా కార్స్ మాత్రం 23 శాతం వృద్ధిని నమోదుచేసింది. ద్విచక్ర వాహనాల్లో.. రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ 17 శాతం క్షీణించగా.. సుజుకీ మోటార్సైకిల్ అమ్మకాలు 12.57 శాతం పెరిగాయి. ట్రాక్టర్ల విభాగంలో ఎస్కార్ట్స్ 15 శాతం తగ్గుదలను నమోదుచేసింది.
ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో 50 శాతానికి మించి మార్కెట్ వాటాను కలిగి మారుతీ సుజుకీ ఇండియా గత నెల విక్రయాల్లో ఏకంగా 18.7 శాతం తగ్గుదలను నమోదుచేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి నెల్లో ఈ సంస్థ విక్రయాలు 1,43,245 యూనిట్లు కాగా, గతేడాది ఏప్రిల్లో 1,72,986 యూనిట్లను విక్రయించింది.
మారుతి సుజుకి మినీ కార్ ఆల్టో అమ్మకాలు సైతం 39.8 శాతం తగ్గి 22,766 యూనిట్లకు చేరాయి. కాంపాక్ట్ విభాగం 13.9 శాతం తగ్గింది. కంపాక్ట్ సెగ్మెంట్లోని స్విఫ్ట్, సెలేరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ కార్ల విక్రయాలు 14 శాతం పతనం అయ్యాయి.
ఇక మధ్యస్థాయి సెడాన్ సియాజ్ అమ్మకాలు కేవలం 2,789 యూనిట్లకు పరిమితం కావడం మొత్తం మారుతి సుజుకి విక్రయాలను దెబ్బ తీసింది.
యుటిలిటీ వాహనాల విక్రయాలు మాత్రం 5.9 శాతం వృద్ధి చెందాయి. ఈ విభాగంలోని విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా విక్రయాలు మాత్రం 6శాతం పెరుగుదలతో 22,035 యూనిట్లు అమ్మడయ్యాయి. ఎగుమతులు 14.6 శాతం పెరిగి 9,177 యూనిట్లుగా వెల్లడయ్యాయి.
ఇంధన ధరలు పెరగడం, బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనల అమలు వంటి ప్రతికూల అంశాల కారణంగా ఈ ఏడాది అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండనున్నాయని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ వివరణ ఇచ్చారు.
మరోవైపు హ్యుండాయ్ అమ్మకాలు 23 శాతం తగ్గి 42,005 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెల్లో ఈ సంస్థ 46,735 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది.
హోండా కార్స్ దేశీ అమ్మకాలు 23 శాతం వృద్ధితో 9,143 యూనిట్ల నుంచి 11,272 యూనిట్లకు చేరాయి. అమ్మకాలు పెరగడానికి లోయర్ బేస్ ఎఫెక్ట్, అమేజ్ బలమైన విక్రయాలు కారణమని సంస్థ సేల్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేశ్ గోయెల్ వెల్లడించారు. చమురు రంగంలో నిశ్చితి ఆటోమొబైల్ రంగానికి పెద్ద దెబ్బ వంటిదని అధికార వర్గాలు తెలిపాయి.
ఇక వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ ఎస్కార్ట్ లిమిటెడ్ విక్రయాలు 14.9 శాతం తగ్గి 5,264 యూనిట్లు తగ్గాయి. వోల్వ, ఐచర్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వీఈసీవీ 3961 కమర్షియల్ వాహనాలను విక్రయించింది.
ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మిశ్రమ స్పందన కనిపించింది. సుజుకి మోటార్ సైకిళ్ల అమ్మకాలు 9.25 శాతం పెరిగి 57,072 యూనిట్లకు చేరాయి. గతేడాది నెలలో 57,072యూనిట్ల విక్రయం జరిగింది.
లగ్జరీ బైక్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఏప్రిల్ దేశీ అమ్మకాలు 21% తగ్గి 59,137 యూనిట్లుగా వెల్లడయ్యాయి. ఎగుమతులు 140% పెరిగిన కారణంగా మొత్తం అమ్మకాలు 17% క్షీణితను నమోదుచేశాయి. ఇక సుజుకీ మోటార్సైకిల్ విక్రయాలు 12.57% పెరిగి 65,942 యూనిట్లుగా నమోదుకాగా, ట్రాక్టర్ల విభాగంలో ఎస్కార్ట్స్ విక్రయాలు 15% తగ్గి 5,264 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఒకినావా స్కూటర్స్ తన పోర్ట్ఫోలియోలోని రెండు మోడళ్లకు ఫేమ్–2 రాయితీ వెసులుబాటు దక్కిందని బుధవారం ప్రకటించింది. కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్)ఆధారంగా ఒకినావా రిడ్జ్ ప్లస్, ఐ–ప్రెయిజ్ స్కూటర్లకు రూ.17,000 నుంచి రూ.26,000 వరకు సబ్సిడీ వర్తిస్తుందని సంస్థ ఎండీ జితేందర్ శర్మ చెప్పారు.
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) నుంచి ఈమేరకు అర్హత ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు ఒకినావా స్కూటర్స్ వెల్లడించింది. సబ్సిడీలు ఇవ్వడం ద్వారా విద్యుత్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రెండో విడత ఫేమ్ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈ స్కీంలో భాగంగా 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రాయితీ ఇవ్వనుంది.