బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, కాంగ్రెస్ నాయకురాలు అర్చన గౌతమ్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, బెదిరించినందుకు ప్రియాంక గాంధీ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) సందీప్ సింగ్పై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) సందీప్ సింగ్పై పోలీసు కేసు నమోదైంది. బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, కాంగ్రెస్ నాయకురాలు అర్చన గౌతమ్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, బెదిరించినందుకు సందీప్ సింగ్పై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అర్చన తండ్రి గౌతమ్ బుద్ద ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్ సింగ్పై కేసు నమోదు చేశారు. వివరాలు.. ప్రియాంక గాంధీ పీఏ సందీప్ సింగ్పై ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్లో గౌతమ్ బుద్ద ఫిర్యాదు చేశారు. సందీప్ సింగ్ తన కూతురికి కులపరమైన పదాలు వాడడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘‘ప్రియాంక గాంధీ ఆహ్వానంపై కాంగ్రెస్ జనరల్ కన్వెన్షన్లో పాల్గొనేందుకు సందీప్ సింగ్ ఫిబ్రవరి 26న ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు నా కుమార్తె అర్చన గౌతమ్ను పిలిచారు. నా కుమార్తె ప్రియాంక గాంధీతో అపాయింట్మెంట్ కోరింది. కానీ అతడు నిరాకరించాడు. నా కుమార్తెతో అనుచితంగా ప్రవర్తించాడు. కులతత్వంతో అసభ్య పదజాలంతో దూషించి, నా కుమార్తెని కించపరిచి, సమావేశ వేదికపై అందరి ఎదుటే చంపేస్తానని బెదిరించాడు. దానికి సంబంధించిన వీడియో రుజువు అక్కడ ఉన్న కెమెరామెన్ వద్ద లభ్యమైంది’’ అని గౌతమ్ బుద్ద పోలీసులకు తెలియజేశారు.
‘‘సందీప్ సింగ్ చర్యల కారణంగా నా కుమార్తె మానసిక పరిస్థితి తీవ్రంగా ప్రభావితమైంది. అలాగే నా కుమార్తె ప్రతిష్ట దెబ్బతింది. అందరి ముందు ఇలా కులాన్ని అవమానపరిచే వ్యాఖ్యలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయి. నా కూతురి కుటుంబాన్ని జైల్లో పెడతానని సందీప్ బెదిరించాడు. నా కూతురి కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అర్చన గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు సందీప్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మీరట్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
ఇక, ఇదే విషయాన్ని అర్చన గౌతమ్ స్వయంగా ఫిబ్రవరి 26న ఫేస్బుక్ లైవ్లో తెలియజేశారు. ఇలాంటి వ్యక్తుల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. ‘‘పార్టీకి నష్టం కలిగించే ఇలాంటి వారిని ఎందుకు ఉంచుకుంటున్నారో అర్థం కావడం లేదు. సందీప్ సింగ్ వల్ల నాలాంటి చాలా మంది కార్మికుల సందేశాలు (ప్రియాంక గాంధీకి) చేరడం లేదు’’ అని అర్చన గౌతమ్ అన్నారు.
