- Home
- Telangana
- Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Onion and Sugar Prices Soar: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి, చక్కెర ధరల మోత మోగుతోంది. రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుడి బడ్జెట్ పై దెబ్బ పడుతూనే ఉంది. మరి కేంద్రం కాందా ఎక్స్ప్రెస్ తో రూ.35కే ఉల్లిని అందిస్తుందా? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

రూ. 70 తాకిన ఉల్లి.. చక్కెర రూ. 65 : వంటింట్లో కిరాణా బిల్లుల మంట
నిత్యావసరాల ధరలు మంటపుట్టిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సగటు సామాన్యుడి నెలవారీ బడ్జెట్కు మళ్లీ పెద్ద కన్నం పడింది. పొద్దున్నే లేస్తే వంటింట్లో వాడే ఉల్లిపాయలు, చక్కెర ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో ఉల్లి, పంచదార ధరలు విపరీతంగా పెరగడంతో రోజూవారీ కిరాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో నాణ్యమైన ఉల్లి కిలో రూ. 65 నుంచి రూ. 70 వరకు పలుకుతున్నాయి.
ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు మ్యాటర్ ఏంటి?
ఉల్లి ధరలు ఉన్నట్టుండి ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడమే. మన దేశంలో ఉల్లికి హబ్ లాంటి మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఈసారి ఖరీఫ్ పంట దిగుబడి 5 నుంచి 7 శాతం వరకు తగ్గింది. దీనికి తోడు రుతుపవనాల అస్థిరత, వర్షాలు సరిగా పడక విత్తనాలు ఆలస్యంగా వేయడంతో మార్కెట్కు రావాల్సిన కొత్త ఉల్లి సరుకు ఆలస్యమైంది. ప్రతి ఏటా రబీ పంట నిల్వలు అయిపోయి, కొత్త ఖరీఫ్ పంట పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వచ్చే మధ్య కాలంలో ఈ గ్యాప్ ఏర్పడుతుంది. ప్రస్తుతం అదే గ్యాప్ వల్ల మార్కెట్లో సరుకు కొరత ఏర్పడి రేట్లు భారీగా పెరిగాయి.
గతంలో కిలో ₹25 నుండి ₹35 మధ్య లభించిన ఉల్లిపాయల ధర ప్రస్తుతం ₹55 నుండి ₹70 వరకు చేరింది. అలాగే చక్కెర ధర కూడా గతంలో కిలో ₹45 నుండి ₹48 ఉండగా, ఇప్పుడు ₹65 నుండి ₹70కి పెరిగింది. ఇక కందిపప్పు విషయానికి వస్తే, ధరలు స్థిరంగా పెరుగుతూ ప్రస్తుతం కిలో ₹120 దాటి వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. చక్కెర ఉత్పత్తి తగ్గిపోవడం, ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడంతో దుకాణదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడంలో డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్టుగా సరఫరా లేదు. దీంతో చక్కెర ధరలు పెరుగుతున్నాయి.
‘కాందా ఎక్స్ప్రెస్’ ఎంట్రీ: అసలు ఏంటీ ట్రైన్ స్పెషల్?
పెరుగుతున్న ఉల్లి ధరలకు బ్రేక్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. అదే ‘కాందా ఎక్స్ప్రెస్’. మహారాష్ట్రలో ఉల్లిని ‘కాందా’ అని పిలుస్తారు. నాసిక్ లోని బఫర్ స్టాక్ నిల్వలను త్వరగా, తక్కువ రవాణా ఖర్చుతో ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గౌహతి వంటి ప్రధాన నగరాలకు చేరవేయడానికి ప్రత్యేక గూడ్స్ రైళ్లను ప్రారంభించారు. లారీలలో తీసుకెళ్లడం కంటే రైలు రవాణా వేగవంతంగా ఉండటమే కాకుండా రవాణా వ్యయం కూడా బాగా తగ్గుతుంది. దీనివల్ల వివిధ ప్రాంతాల్లో ఉల్లి కొరత తీరి, ధరలు అదుపులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో NAFED, NCCF కేంద్రాల ద్వారా కిలో ఉల్లిని రూ. 35 రాయితీ ధరకే విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
తెలుగు రాష్ట్రాలపై కాందా ఎక్స్ప్రెస్ ప్రభావం ఎంత?
కాందా ఎక్స్ప్రెస్ రాకతో దేశవ్యాప్తంగా లభ్యత పెరిగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ధరలు వెంటనే తగ్గిపోతాయా అంటే చెప్పలేం. ఎందుకంటే కేంద్ర బఫర్ స్టాక్ ఏపీ, తెలంగాణ మార్కెట్లకు ఏ పరిమాణంలో చేరుతుందనే దానిపైనే స్థానిక రేట్లు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ రైతు బజార్లలో హోల్సేల్ స్థాయిలోనే కిలో రూ. 40 వరకు ఉంది. రిటైల్ షాపుల్లో రవాణా ఖర్చులు, వ్యాపారుల మార్జిన్ కలిసి రూ. 60 దాటుతోంది. ప్రభుత్వ రాయితీ ఉల్లి విక్రయ కేంద్రాలు మన దగ్గర పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తప్ప సాధారణ మార్కెట్లలో ధరలు వెంటనే దిగొచ్చే సూచనలు కనిపించడం లేదు.
సామాన్యుడిపై భారం: రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి?
కేవలం ఉల్లి మాత్రమే కాదు, చక్కెర ధరలు కూడా గత మూడు నెలల్లో దాదాపు 40% వరకు పెరిగాయి. గతంలో కిలో రూ. 45 ఉన్న పంచదార ఇప్పుడు రూ. 70 మార్కును తాకింది. వీటికి తోడు టమోటా, కందిపప్పు, వంటనూనెల ధరలు కూడా పెరగడంతో సగటు కుటుంబం నెలకు అదనంగా రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. రాబోయే 3 నుంచి 4 వారాల పాటు, అంటే కొత్త ఖరీఫ్ పంట మార్కెట్కి పూర్తి స్థాయిలో వచ్చే వరకు ఉల్లి ధరలు ఇలాగే ఉండే అవకాశముంది. ఈ లోపు ప్రభుత్వం స్థానికంగా బఫర్ స్టాక్ విడుదల చేస్తే ధరలు రూ. 50 పరిధికి తగ్గొచ్చు, లేదంటే రూ. 70 పైనే కొనసాగే అవకాశముందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

