- Home
- Telangana
- IMD Rain Alert: బంగాళాఖాతంలో ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
IMD Rain Alert: బంగాళాఖాతంలో ద్రోణి.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు భారీ వర్షాలు
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు ఉంటాయని హెచ్చరించింది.

Weather Update: ఏపీ, తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన
నైరుతీ రుతుపవనాలు మళ్లీ బలంగా పుంజుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అనుబంధంగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ముబ్బులు కమ్మేసి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మొదలయ్యాయి. రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
ఉత్తర తెలంగాణలో దంచికొట్టిన వానలు
ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా జనకాపూర్, కోటపల్లి, తాండూరు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లకు పైగా అతిభారీ వర్షం కురిసింది. అలాగే పెద్దపల్లి, ములుగు, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లోనూ ముసురు వాతావరణంతో పాటు భారీ వానలు పడ్డాయి. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో సైతం సాయంత్రానికి వాతావరణం చల్లబడి మోస్తరు జల్లులు కురిశాయి. ఉమ్మడి నల్గొండ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడటంతో రైతులు, సాధారణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
మహారాష్ట్రలో రెడ్ అలర్ట్.. నదుల్లో పెరిగే ప్రవాహాలు
మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కురుస్తున్న వర్షాల ధాటికి ఐఎండీ రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే కృష్ణా, గోదావరి నదుల మళ్లీ ఉప్పొంగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గోదావరి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏపీ తీరానికి ఈదురు గాలుల ముప్పు.. మత్స్యకారులకు హెచ్చరిక
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాల తీవ్రత కొంత ఎక్కువగా ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం అలజడిగా మారనుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
గ్లోబల్ వెదర్ ఎఫెక్ట్.. ఖరీఫ్ సీజన్పై ఆందోళన
వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం, ఎల్ నినో ప్రభావం బలంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కమ్ముకున్నా అనుకున్న స్థాయిలో ఆకస్మిక వరదలు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రుతుపవనాల కాలం ప్రధానంగా తేలికపాటి, మోస్తరు జల్లులతోనే సాగే అవకాశాలు కనిపిస్తుండటంతో, ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు ప్రత్యామ్నాయ సాగునీటి మార్గాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు ఇప్పటికే అనుకున్న స్థాయిలో పడకపోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రాంతాలు ఇప్పటివరకు భారీ వర్షాలు లేక తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.

