IMD Rain Alert : ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు రెడీ... ఇక ఈ జిల్లాల్లో భారీ వర్షాలే
తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లనికబురు అందించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని… దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురవబోతున్నాయని ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Weather Update : గతవారం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలే కురిశాయి. కానీ నాలుగైదు రోజులుగా వర్షాల జాడలేదు... దీంతో వర్షాభావ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందేమోనని తెలుగు ప్రజలు ముఖ్యంగా రైతులు కంగారుపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లనికబురు చెప్పింది... మళ్లీ వర్షాలు మొదలవుతాయని ప్రకటించింది.
నేడు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ప్రస్తుతం ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది... దీని ప్రభావంతో ఇవాళ (ఆగస్ట్ 29, శనివారం) వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.
నేడు తెలంగాణలో వర్షాలు
నేడు (ఆగస్ట్ 29, శనివారం) తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమ్రంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే భారీ వర్షాలేమీ ఉండవని పేర్కొంది.
ఇక హైదరబాద్ తో పాటు మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ నేడు చెదురుమదురు జల్లులు పడే అవకాశాలు ఉన్నాయంటోంది. ఉదయం, మధ్యాహ్నం పొడి వాతావరణమే ఉంటుంది... సాయంత్రం, రాత్రి సమయంలో జల్లులు మొదలయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర తెలిపింది.
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలు..
తెలంగాణలో భారీ వర్షాభావ లోటు కొనసాగుతోంది... రాబోయే రోజుల్లో ఎల్ నినో తెలంగాణ రాష్ట్రం మీద తీవ్రంగా ప్రతాపం చూపించబోతోందని వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ఇటీవల అల్పపీడన ప్రభావంతో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి... కానీ ఆగస్టు చివర్లో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి... మిగిలిన జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయి లేదా పొడిగా ఉంటుందని ప్రకటించారు.
తెలంగాణలో వర్షాభావ లోటు సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉంటుంది... ఆపై కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. అంటే రాబోయే 10 రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కపోతతో కూడిన వాతావరణం నెలకొంటుందన్నారు. సెప్టెంబర్ మొదటివారం నాటికి తెలంగాణలో మొత్తం వర్షాభావ లోటు 20% దాటనుంది... హైదరాబాద్లో లోటు 25% దాటనుందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. లోటు వర్షపాతం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపు చేయాలని... ఇందుకు తగినట్లు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
నిన్నమొన్నటితో పోలిస్తే ఇవాళ (ఆగస్ట్ 29) పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుందని... వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ చెబుతున్నారు. మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో కొన్నిజిల్లాల్లో మంచి వర్షపాతమే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్, వెస్ట్ తెలంగాణ జిల్లాలు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

