- Home
- Entertainment
- Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Namitha: తాళి, బొట్టు, వ్రతాలు వంటి సంప్రదాయాలు కేవలం మహిళలకే ఎందుకున్నాయని నటి నమిత ప్రశ్నించారు. ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీశాయి.

దుమారం రేపుతున్న నటి నమిత వ్యాఖ్యలు
నటి నమిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భారతీయ పెళ్లి సంప్రదాయాలు, సమాజంలోని కొన్ని పద్ధతులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాళి కట్టడం, బొట్టు పెట్టుకోవడం, భర్త బాగుండాలని వరలక్ష్మీ వ్రతం చేయడం వంటివన్నీ మహిళలే ఎందుకు చేయాలని సమాజం కోరుకుంటుందని ఆమె ప్రశ్నించారు. భార్య కోసం భర్తలు ఎప్పుడైనా ఉపవాసం ఉంటారా అని నమిత అడిగారు. ఈ నిబంధనలన్నీ సమాజం సృష్టించినవే తప్ప, ఏ మత గ్రంథాలలోనూ ఇలా లేదని ఆమె స్పష్టం చేశారు. నమిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు నమిత సుపరిచితమే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గత ఆరేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నమిత, ఈ ఇంటర్వ్యూతో మళ్లీ వార్తల్లో నిలిచారు.
మహిళలు మాత్రమే తాళి ఎందుకు ధరించాలి?
మగవాళ్లకు లేని కొన్ని నిబంధనలు ఆడవాళ్లకు మాత్రమే ఎందుకున్నాయని ఆమె సూటిగా ప్రశ్నించారు. భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు వరలక్ష్మీ వ్రతం లాంటివి చేయడంపైనా నమిత తన అభిప్రాయాన్ని చెప్పారు. `ఆడవాళ్లు ఎందుకు తాళి కట్టుకోవాలి? వాళ్లే బొట్టు పెట్టుకోవాలి, సంప్రదాయాలు పాటించాలని ఎందుకు ఆశిస్తారు? మగవాళ్లకు లేని ఈ రూల్స్ అన్నీ ఆడవాళ్లకే ఎందుకు?` అని ఆమె అడిగారు.
అన్ని నిబంధనలు మహిళలకేనా?
`నా భర్త క్షేమంగా ఉండాలని నేను ఉపవాసం ఉంటున్నాను. కానీ, భార్య ఆరోగ్యం కోసం భర్త ఏడాదికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలని ఏదైనా నియమం ఉందా? అలాంటిదేమీ లేదు. సమాజం అలాంటి నియమాన్ని ఎందుకు సృష్టించలేదు? అన్ని నిబంధనలూ మహిళలకేనా? ఇవన్నీ సమాజం సృష్టించినవే. ఏ గ్రంథంలోనూ ఇలాంటి నియమాలు లేవు,` అని నమిత అభిప్రాయపడ్డారు. నమిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆమె ప్రశ్నలకు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు భారతీయ సంప్రదాయాల గురించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరితో వివాహం
తమిళంలో 'ఏయ్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన నమిత, తెలుగులోనూ 'సొంతం', ‘జెమిని’, `ఒక రాజు ఒక రాణి`, `నాయకుడు`, `బిల్లా`, `సింహ` వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ భాషల్లో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2017లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని నమిత పెళ్లి చేసుకున్నారు. తన 41వ పుట్టినరోజున గర్భవతి అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2022 ఆగస్టులో నమిత కవలలకు జన్మనిచ్చారు. 2020లో విడుదలైన 'మియా' అనే తమిళ చిత్రంలో నమిత చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల వ్యాయామం ద్వారా బరువు తగ్గిన నమిత, తన లేటెస్ట్ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. నయా ఫోటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది నమిత.

