ఈ పిచ్ టెస్టులకు పనికి రాదు, ఐసీసీయే నిర్ణయించాలి... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కామెంట్!
దాదాపు 11 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య పింక్ బాల్ టెస్టు జరిగింది. జరిగిన మొదటి టెస్టే పింక్ బాల్ టెస్టు కావడం, అది కూడా కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు పిచ్ బాగానే ఉందని అంటుంటే, మరికొందరు ఇది నాసిరకం పిచ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు...
బుధవారం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పింక్ బాల్ టెస్టు, గురువారం రాత్రి 8 గంటల 30 నిమిషాలలోపు ముగిసింది. ఐదు రోజుల పాటు సాగాల్సిన టెస్టు మ్యాచ్ కాస్తా... పూర్తిగా ఆరు షెడ్యూల పాటు కూడా సాగలేదు...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకి కోలుకోలేని షాక్ ఇచ్చిన భారత స్పిన్నర్లు... తొలి ఇన్నింగ్స్లో 112 పరుగులకి, రెండో ఇన్నింగ్స్లో 81 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లాండ్ జట్టు మాత్రమే బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చి ఉండేవి కావు...
అయితే భారత బ్యాట్స్మెన్ కూడా 145 పరుగులకే ఆలౌట్ కావడం పిచ్పై తీవ్రమైన విమర్శలు రావడానికి కారణమైంది. నిజానికి భారత ఇన్నింగ్స్లో రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ అవుట్ కావడానికి దూకుడుగా ఆడాలని ప్రయత్నించడమే కారణం. వీరితో పాటు భారత బ్యాట్స్మెన్లలో చాలామంది నిర్లక్ష్యంగా ఆడి, భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయినవారే.
మొతేరాలో భారత బ్యాట్స్మెన్ చేసిన తప్పిదాల కారణంగానే జో రూట్... 6.2 ఓవర్లు బౌలింగ్ చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన నమోదుచేశాడు. జో రూట్కి టెస్టుల్లో ఇదే మొట్టమొదటి ఐదు వికెట్ల ప్రదర్శన...
పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 66, రెండో ఇన్నింగ్స్లో 25 పరుగులు చేసిన రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా వికెట్ బ్యాటింగ్కి చక్కగా సహకరిస్తోందని కామెంట్ చేశారు.
‘పిచ్ ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఐదు వికెట్లు దక్కాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మా వరకైతే ఈ వికెట్ ఛాలెంజింగ్గానే అనిపించింది. తొలి ఇన్నింగ్స్లో మంచి పొజిషన్లో ఉన్నట్టు అనిపించింది. కానీ తక్కువ స్కోరు ఆలౌట్ అయ్యాం...
రెండో ఇన్నింగ్స్లో అయినా 200 స్కోరు చేసి ఉంటే, మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేది.. ఈ పిచ్ నాణ్యతని ఐసీసీయే నిర్ణయిస్తుంది. టీమిండియా బౌలింగ్ బాగుంది.... ’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్...
ఒకవేళ జో రూట్ చెప్పినట్టుగా మొతేరా పిచ్ నాసిరకమైనదిగా ఐసీసీ తేలిస్తే, అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమాల ప్రకారం ఆతిథ్య జట్టు అయినందుకు భారత జట్టు 3 పాయింట్లు కోల్పోతుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న టీమిండియా, మూడు పాయింట్లు కోల్పోయినా ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంటుంది.
మొతేరా స్టేడియంలోనే జరిగే నాలుగో టెస్టు ఫలితం టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధిస్తుందా? లేదా? అనేది తేల్చనుంది. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా, గెలిచినా న్యూజిలాండ్తో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో ఢీ కొంటుంది టీమిండియా. ఒక వేళ ఆఖరి టెస్టులో టీమిండియా ఓడితే, ఆస్ట్రేలియా ఫైనల్కి అర్హత సాధిస్తుంది...