హైదరాబాద్తో పాటు నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021... ముంబైలో అనుమానమే!
కరోనా లాక్డౌన్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ను యూఏఈ వేదికగా జనాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించింది బీసీసీఐ. జనాలు రాకపోయినా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ రావడం, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంలో వందల కోట్ల లాభాలు ఆర్జించింది భారత క్రికెట్ బోర్డు. ఈసారి స్వదేశంలో, ప్రేక్షకుల మధ్య ఐపీఎల్ 2021 సీజన్ జరగనుంది...
కరోనా నియమాలు ఇంకా అమలులో ఉండడంతో ఐపీఎల్ 2021 సీజన్ ఎలా నిర్వహించాలనే దానిపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. తొలుత ఒకే నగరంలో ఐపీఎల్ 2021 సీజన్ మొత్తం నిర్వహించాలని భావించింది బీసీసీఐ...
అయితే ఒకే సిటీలో ఐపీఎల్ సీజన్ మొత్తం నిర్వహించడం చాలా కష్టమని భావిస్తోంది బీసీసీఐ. అంతేకాకుండా ముంబై నగరంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఐపీఎల్ నిర్వహించేందుకు ఈ నగరం కరెక్టు కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి...
‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే నగరంలో ఐపీఎల్ సీజన్ మ్యాచులన్నీ నిర్వహించడం చాలా రిస్క్. ముఖ్యంగా ముంబైలో మళ్లీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న హైదరాబాద్, కోల్కత్తా, బెంగళూరు వంటి నగరాల్లో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్నాం...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు...
ముంబై సిటీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ ఐపీఎల్ పెట్టే బదులు, అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉన్న అహ్మదాబాద్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు నిర్వహించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది...
ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం కోల్కత్తా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఐపీఎల్ మ్యాచులు జరగడం ఖాయమైంది. ముంబైతో పాటు హైదరాబాద్లో మ్యాచులు నిర్వహించడంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి...
ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్లో ఉన్నాయి. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఈ జట్లకు హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా అభిమానులు ఉన్నారు...
మిగిలిన జట్లతో పోలిస్తే సన్రైజర్స్ హైదరాబాద్కి ఫాలోవర్లు ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా ప్రజలు చాలామంది ఎస్ఆర్హెచ్కి మద్ధతు తెలపడం లేదు. హైదరాబాద్ అని పేరు ఉండడంతో సన్రైజర్స్ తమ జట్టు కాదని భావిస్తున్నారు...
అంతేకాకుండా ముంబైకి రోహిత్, ఆర్సీబీకి కోహ్లీ ఉన్నట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో టీమిండియాకు చెందిన స్టార్ క్రికెటర్ ఎవ్వరూ లేకపోవడం కూడా ఫాలోయింగ్ తగ్గడానికి ప్రధాన కారణం. దీంతో హైదరాబాద్లో మ్యాచులు నిర్వహణకు ఇంకా క్లారిటీ రావడం లేదు...