- Home
- Sports
- Cricket
- టెస్టుల్లో టీ20 ఫార్ములా... మూడో టెస్టులో టీమిండియా ఓటమికి రోహిత్ తొందరపాటే కారణమా...
టెస్టుల్లో టీ20 ఫార్ములా... మూడో టెస్టులో టీమిండియా ఓటమికి రోహిత్ తొందరపాటే కారణమా...
వన్డే, టీ20, టీ10, హండ్రెడ్...ఇలా క్రికెట్లో ఎన్ని ఫార్మాట్లు వచ్చినా సంప్రదాయ టెస్టు క్రికెట్లో ఉండే మజాయే వేరు. అయితే ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అలాంటి కిక్ దొరకడం. మొదటి మూడు టెస్టులు కూడా మూడు రోజుల్లోనే ముగిశాయి.

Image credit: PTI
తొలి రెండు టెస్టులు కనీసం రెండున్నర రోజుల పాటు సాగగా ఇండోర్లో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల ఒక్క సెషన్లో ముగిసింది. మూడో రోజు పూర్తిగా ఒక్క సెషన్ కూడా బ్యాటింగ్ చేయకుండానే మ్యాచ్ని ముగించేసింది ఆస్ట్రేలియా. ఇది ఇలాగే కొనసాగితే 5 రోజుల టెస్టులకు కాలం చెల్లినట్టే...
Image credit: PTI
ఇండోర్ టెస్టులో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీయే కారణమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ స్వదేశంలో వరుసగా 13 టెస్టులు గెలిచిన తర్వాత తొలి ఓటమి ఎదుర్కొన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ 9 టెస్టులు గెలిచిన తర్వాత స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడాడు. రోహిత్ మాత్రం ఐదో టెస్టులోనే ఓటమి చవిచూశాడు...
ఇండోర్ టెస్టులో టీమిండియా ఓటమికి ఆటగాళ్ల దూకుడే ప్రధాన కారణం. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓపిగ్గా క్రీజులో నిలబడేందుకు ఇష్టపడలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, 6 ఓవర్లకే 27 పరుగులు చేసింది. అయితే మ్యాట్ కుహ్నేమన్ బౌలింగ్లో నాలుగు బంతులు డాట్ బాల్స్ రావడంతో రోహిత్ శర్మ తట్టుకోలేకపోయాడు..
Image credit: PTI
ఐదో బంతిని బౌండరీ బయట పడేయాలనే ఆవేశంతో క్రీజు దాటి ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత జట్టు 82 పరుగుల తేడాతో మిగిలిన అన్ని వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ అంత ఆవేశపడి, ఫ్రంట్ ఫుట్కి వచ్చి షాట్ ఆడడానికి ఇది టీ20 కాదు. వాస్తవానికి ఈ మధ్య టీ20ల్లో ఇలాంటి దూకుడు రోహిత్లో కనిపించడం లేదు...
కాస్త ఓపికగా కొట్టడానికి ఇంకో ఓవర్ ఉందిగా అని రోహిత్ శర్మ ఆలోచించి ఉంటే... టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కనీసం 200 పరుగులు చేసి ఉండేది. మ్యాచ్ గెలవడానికి, సిరీస్ గెలవడానికి, టెస్టుల్లో నెం.1 ర్యాంకును అందుకోవడానికి, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించడానికి ఈ పరుగులు సరిపోయేవి...
Image credit: PTI
కనీసం రెండో ఇన్నింగ్స్లో కూడా రోహిత్ ఆటతీరు, ప్లాన్ మారలేదు. 12 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్లో అవుటైన రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా- అక్షర్ పటేల్ కలిసి డిఫెన్స్ ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మిస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు.. షాట్స్ ఆడాల్సిందిగా ఇషాన్ కిషన్తో పంపించాడు...
బంతి కాస్త గాల్లోకి లేపేందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించే ఛతేశ్వర్ పూజారా, కెప్టెన్ ఆదేశించడంతో సిక్సర్ బాదాడు. ఆ తర్వాత అలా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఒక్క సిక్సర్తో మ్యాచ్ రిజల్ట్ మారిపోవడానికి ఇది టీ20 కాదు, ఐపీఎల్ అంతకంటే కాదు..
Image credit: Getty
అక్షర్ పటేల్ ఓ ఎండ్లో ఉన్నా, మరో ఎండ్లో మహ్మద్ సిరాజ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. సిరాజ్ ఇలాంటి షాట్ ఆడేందుకు ప్రయత్నించడానికి కూడా రోహిత్ సూచనలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...
Image credit: PTI
టెస్టు మ్యాచ్ అంటే డిఫెన్స్, డిఫెన్స్తోనే అటాక్ చేయడం. బజ్బాల్ కాన్సెప్ట్ అన్ని చోట్ల సెట్ కాదు. ముఖ్యంగా భారత్లోని ఇలాంటి స్పిన్ పిచ్లపై అస్సలు సెట్ కాదు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ త్వరగా గ్రహించకపోతే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో మరోసారి టీమిండియాకి నిరాశే ఎదురు అవుతుంది..