భారత్ ఓటమికి కారకుడు జడ్డూనే : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
INDvsAUS: ఇండోర్ టెస్టులో భారత్ ఓటమికి అందరూ పిచ్ ను నిందిస్తున్న వేళ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అని వ్యాఖ్యానించడం గమనార్హం.

భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఓడిపోవడానికి పిచ్ ప్రధాన కారణమని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు విశ్లేషకులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడో టెస్టు తొలి రోజు నుంచే అతిగా తిరిగిన బంతి భారత్ కు షాకుల మీద షాకులిచ్చింది. ఈ పిచ్ కు ఐసీసీ కూడా ‘పూర్’ రేటింగ్ ఇచ్చింది.
అయితే అందరూ పిచ్ ను నిందిస్తున్న వేళ భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఓటమికి కారణం రవీంద్ర జడేజానే అన్నాడు. మూడో టెస్టు తర్వాత గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ముగిసింది. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే టర్నింగ్ పాయింట్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఈ మ్యాచ్ లో లబూషేన్ - ఖవాజాలు తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు..
భారత్ తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ అయిన వేళ లబూషేన్-ఖవాజాలు మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆ నోబాల్ (లబూషేన్ కు రవీంద్ర జడేజా వేసింది) ఇండియాను మ్యాచ్ నుంచి దూరం చేసింది..’అని గవాస్కర్ చెప్పాడు.
కాగా ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 12 పరుగులకే ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబూషేన్ ను ఆదిలోనే జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ అంపైర్ ఆ బంతిని ఓవర్ స్టెప్ నోబాల్ గా ప్రకటించాడు. ఆ తర్వాత జడేజా వేసిన ఓవర్లలో లబూషేన్ జాగ్రత్తగా ఆడాడు. ఇద్దరూ కలిసి 96 పరుగులు జోడించారు.
జడేజా.. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 9 నోబాల్స్ వేశాడు. తొలి టెస్టులో స్టీవ్ స్మిత్ తో పాటు రెండో టెస్టులో కూడా మరో బ్యాటర్ ను ఔట్ చేసిన బంతులూ నోబాల్స్ గానే తేలాయి. ఆశ్చర్యకరంగా ఇండోర్ టెస్టులో జడేజా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీయడం గమనార్హం.
ఈ సిరీస్ లో ఇప్పటివరకు 3 టెస్టులలో 21 వికెట్లు తీసి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. లియాన్ (19), అశ్విన్ (18) లు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఈ సిరీస్ లో నాలుగో టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్.. మిగతా సమీకరణాలతో తేడా లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఓడినా, డ్రా అయినా శ్రీలంక - న్యూజిలాండ్ రెండు టెస్టుల సిరీస్ ఫలితం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.