చాలకాలం తర్వాత టీమ్ లోకి వచ్చినా అవకాశం రాకపోవడంపై పృథ్వీ షా కామెంట్స్..
Prithvi Shaw: జూనియర్ సెహ్వాగ్ అవుతాడనుకుంటే అవకాశాలు రాక దేశవాళీకే పరిమితమైన టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా ఇటీవలే తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

దేశవాళీ క్రికెట్ లో సర్ఫరాజ్ ఖాన్ తో పాటు మొన్నటివరకు తరుచూ బీసీసీఐ సెలక్టర్లు ఇచ్చిన షాకులకు బలైన వారిలో మొదటి స్థానంలో ఉండేవాడు పృథ్వీ షా. ఈ ముంబై బ్యాటర్ కు టాలెంట్ టన్నుల్లో ఉన్నా అదృష్టం మాత్రం అవిసె గింజ అంత కూడా లేకపోవడంతో జాతీయ జట్టులోకి రావడం అతడికి శక్తికి మించిన పనే అయింది.
చాలాకాలం తర్వాత అతడు ఇటీవలే న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టులోకి వచ్చాడు. రిషభ్ పంత్, సంజూ శాంసన్ లు లేకపోవడంతో షా కు అవకాశం వచ్చింది. అయితే జాతీయ జట్టులోకి రానైతే వచ్చాడు గానీ మూడింట్లో ఒక్క మ్యాచ్ లో కూడా అతడికి తుది జట్టులో అవకాశం రాలేదు. దీనిపై తాజాగా పృథ్వీ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ 24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ.. ‘నేను తిరిగి భారత టీ20 జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాకు తుది జట్టులో చోటు దక్కలేదు. అది కాస్త నిరాశే అయినా టీమ్ తో కలిసి నడవడం నాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. జట్టుతో కలవడంతో పాటు ట్రైనింగ్ సెషన్స్ ను నేను బాగా ఆస్వాదించా...’అని చెప్పాడు.
టీమిండియాలోకి వచ్చినా తుది జట్టులో ఆడతానా..? లేదా..? అన్నది తన చేతుల్లో లేదని అది కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లు చూసుకుంటారని షా తెలిపాడు. ‘తుది జట్టులో అవకాశం దక్కించుకోవడం నా చేతుల్లో లేదు. ఎప్పుడు ఆడతాను..? ఎప్పుడు ఆడను..? అనేది కెప్టెన్, హెడ్ కోచ్ నిర్ణయిస్తారు. నాకు అవకాశం ఇవ్వకున్నా చాలాకాలంగా జట్టులో నిలకడగా రాణిస్తున్న వారికి (గిల్ కు ఇవ్వడంపై) ఛాన్స్ ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను..’అని చెప్పాడు.
టీ20లలో సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్ లను పక్కనబెట్టిన సెలక్టర్లు.. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ లతో ఓపెనింగ్ చేయిస్తున్నారు. ఈ ఇద్దరికీ విఫలమైనా వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్ ను దృఫ్టిలో ఉంచుకుని కొత్త జట్టును సంసిద్ధం చేయడానికి సెలక్టర్లు పదే పదే ఈ ఇద్దరినీ ఆడిస్తున్నారని వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇక తాను చాలా కాలం తర్వాత జట్టులోకి రావడంపై స్పందిస్తూ.. ‘నేను దేశవాళీలో పరుగులు చేస్తూనే ఉన్నా. నిలకడగా రాణించా. అయితే టీమిండియాలోకి రావడానికి అవి సరిపోవని తెలిసింది. కానీ రంజీ ట్రోఫీ లో భాగంగా అసోంపై చేసిన ట్రిపుల్ సెంచరీ (379) తో నా కెరీర్ మళ్లీ గాడిలో పడ్డట్టే అనిపించింది. కొన్నిసార్లు నాక్కూడా ఇంత ఆడుతున్నా నేను టీమిండియాకు ఎందుకు సెలక్ట్ కాలేకపోతున్నా అనిపించేది.. అయితే ఈ అవకాశం అంత ఈజీగా వచ్చిందైతే కాదు..’అని చెప్పాడు.