యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు.? కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? అసలేం జరుగుతోంది.?
UPI: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అక్టోబర్ 15, 2026 నుంచి కొన్ని వ్యాపార లావాదేవీలకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇంతకీ ఏంటీ విధానం.? దీంతో ఏం జరగనుంది.? లాంటి పూర్తి వివరాలు..

రూ.2 వేల తర్వాత 0.4 శాతం MDR..
సాధారణంగా రూ.2,000 కంటే ఎక్కువ విలువైన అర్హత కలిగిన P2M UPI చెల్లింపులపై 0.4 శాతం MDR వర్తిస్తుంది. అయితే పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసినా ఈ ఛార్జీకి గరిష్ఠ పరిమితిని రూ.300గా నిర్ణయించారు. అంటే లావాదేవీ విలువ ఎంత పెరిగినా వర్తించే MDR నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని మించదు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి కొన్ని నిర్దిష్ట రంగాలకు మాత్రం ప్రత్యేక రేటు ఉంటుంది. రూ.2,000కు మించిన అర్హత కలిగిన లావాదేవీలపై ఒక్కో ట్రాన్సాక్షన్కు రూ.5 ఫ్లాట్ MDR వర్తించే విధానం ఉంటుంది. ముఖ్యంగా ఈ MDRను కస్టమర్ నుంచి ప్రత్యేకంగా వసూలు చేయడానికి ఉద్దేశించిన ఛార్జీ కాదు. ప్రభుత్వం కూడా UPI వినియోగదారులపై లావాదేవీ ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
షాపుల్లో QR స్కాన్ చేస్తే అదనపు ఫీజు ఉండదు
రోజువారీ కొనుగోళ్లలో వినియోగదారులకు పెద్దగా మార్పు ఉండదు. స్థానిక దుకాణాలు, చిన్న వ్యాపారుల వద్ద QR కోడ్ స్కాన్ చేసి UPI ద్వారా చెల్లించినప్పుడు కస్టమర్పై ప్రత్యేక MDR విధించరు. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపే P2P లావాదేవీలు కూడా ఉచితంగానే కొనసాగుతాయి. ఒకరి సొంత ఖాతాల మధ్య చేసే బదిలీలకు కూడా ఈ MDR విధానం వర్తించదు.
చిన్న వ్యాపారులను కూడా కొత్త ఛార్జీల ప్రభావం నుంచి రక్షించే విధానం ఉంది. ముఖ్యంగా చిన్న QR వ్యాపారులకు నిర్దేశించిన పరిమితుల్లో UPI చెల్లింపులకు జీరో MDR రక్షణ కొనసాగుతుంది. అందువల్ల సాధారణ చిన్న దుకాణాలు, వీధి వ్యాపారుల UPI స్వీకరణపై కొత్త విధానం ప్రభావం పరిమితంగానే ఉండనుంది.
యూపీఐ ఆటోపేకి MDR వర్తిస్తుందా?
యూపీఐ ఆటోపే, యుటిలిటీ బిల్లులు, OTT సబ్స్క్రిప్షన్లు, మ్యూచువల్ ఫండ్ వంటి రికరింగ్ లేదా ఆటోమేటెడ్ పేమెంట్స్ విషయంలో ప్రతి లావాదేవీని సాధారణ P2M చెల్లింపుతో సమానంగా చూడకూడదు. కొత్త ఎమ్డీఆర్ నిర్మాణం ప్రధానంగా నిర్దేశించిన పీ2ఎమ్ మర్చంట్ ట్రాన్సిక్షన్స్కు సంబంధించినది. కాబట్టి ఆటోపేకి తప్పనిసరిగా 0.4 శాతం MDR పడుతుందని భావించాల్సిన అవసరం లేదు. అలాగే UPI ద్వారా క్రెడిట్ కార్డు లేదా ఇతర క్రెడిట్ ఆధారిత చెల్లింపులకు ప్రత్యేక నియమాలు, ఛార్జింగ్ నిర్మాణాలు ఉంటాయి. అందువల్ల వాటిని నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి జరిగే సాధారణ యూపీఐ పీ2ఎమ్ లావాదేవీలతో పోల్చకూడదు.
కార్డులతో పోలిస్తే MDR తక్కువ..
క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులతో పోలిస్తే కొత్త UPI MDR రేటు తక్కువగానే ఉంది. ప్రభుత్వం వివరించిన ప్రకారం UPI వ్యవస్థను దీర్ఘకాలికంగా నిర్వహించేందుకు మౌలిక సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలు, భద్రత వంటి అంశాలకు నిరంతర పెట్టుబడులు అవసరం. అందుకే మొత్తం UPI వ్యవస్థపై కాకుండా ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలపైనే పరిమిత MDR విధానం తీసుకొచ్చారు.
మరోవైపు క్యాపిటల్ మార్కెట్కు సంబంధించిన కొన్ని లావాదేవీలకు ప్రత్యేక MDR రేట్లు వర్తించే విధానం కూడా ప్రకటించారు. అయితే UPI వినియోగదారులకు సాధారణంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. UPI ద్వారా వ్యక్తిగతంగా డబ్బు పంపడం, సాధారణ చిన్న చెల్లింపులు చేయడం కోసం వినియోగదారులపై కొత్తగా ప్రత్యేక ఛార్జీ విధించడం లేదు.

