ఫామ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ...ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో మరోసారి చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్
ఒక టైమ్ లో పూరి జగన్నాథ్ రాసిందే కథ, చెప్పిందే డైలాగు, యాటిట్యూడే.. క్యారక్టరైజేషన్ అన్నట్లు నడిచింది.అయితే ఈ మధ్యన ఆయన సినిమాలు వరస పెట్టి దెబ్బ తిన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు అనుకునే లోగా లైగర్ తో డిజాస్టర్ ఇచ్చారు. అయితే పూరి తో సినిమా చెయ్యాలనుకునే హీరోలకు కొదవ లేదు. కానీ పూరి కు ఎప్పటి నుంచో కోరిక ..చిరంజీవి తో సినిమా చేయాలని. పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఇన్నేళ్ల కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కించుకోలేకపోయాడు.
గతంతో ఓసారి ‘ఆటో జానీ’ స్టోరీ తెరపైకి వచ్చినా.. కొన్నాళ్ల తర్వాత ఆగిపోయింది. అయితే రీఎంట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న చిరు.. చాల మంది దర్శకులకు అవకాశాలిస్తున్నాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ రీసెంట్గా చెప్పిన ఓ కథ విన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ స్టోరీకి చిరంజీవి సై అనకుండా ఓ సలహా ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అదేమిటంటే...
గతంలో టెంపర్ టైమ్ లో పూరి జగన్నాథ్ వేరే రైటర్ వక్కంతం కథ తీసుకుని పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు కూడా అలాగే వేరే రచయిత నుంచి కథను పిక్ చేయమని , దానికి ట్రీట్మెంట్, డైలాగులు పూరి రాసుకుంటే తను చేయటానికి ఏ ఇబ్బందీ లేదని కండీషన్ పెట్టినట్లు సమాచారం.పూరి ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదని సమాచారం.
ఇక 'లైగర్' డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అంటే హీరోలు ముఖం చాటేస్తున్నారనేది నిజం. మొదలెట్టిన 'జన గణ మణ'ను పక్కన పెట్టేశారు విజయ్ దేవరకొండ. ఈ సమయంలో పూరికి చిరు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఆ మధ్య 'వాల్తేరు వీరయ్య' సెట్స్లో చిరు, పూరి మీటింగ్ ఓ సారి జరిగిందని టాక్. స్క్రిప్ట్ రెడీ చేయమని పూరికి చిరు చెప్పారట. స్క్రిప్ట్ రెడీ అయ్యి, అంతా ఓకే అయితే ఈ ఏడాదిలో షూటింగ్ స్టార్ట్ చేద్దామని పూరికి చిరు అభయం ఇచ్చారట.
వాస్తవానికి చిరు, పూరీకి మధ్య ఎప్పటి నుంచో మంచి బాండింగ్ ఉంది. ‘చిరుత’ మూవీతో రాంచరణ్ను లాంచ్ చేసింది కూడా పూరీ కావటంతో ఆయనపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అంతేకాదు చిరంజీవి రీసెంట్ మూవీ ‘గాడ్ ఫాదర్’లోనూ జగన్ చిన్న క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో పూరి జగన్.. మెగాస్టార్ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.
