ప్రొఫెషనల్ క్రికెటర్ ను తలపిస్తూ... మంత్రి హరీష్ ధనాధన్ బ్యాటింగ్
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ బ్యాట్ చేతబట్టి ప్రొఫెషనల్ క్రికెటర్ మాదిరిగా ధనాధన్ షాట్లతో బౌలర్ పై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... క్రీడలు లేక పిల్లల్లో శారీరక పటుత్వం తగ్గిపోయిందన్నారు. సెల్ ఫోన్ల కు అలవాటు పడిపోయి చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, షుగర్లు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా వుండాలంటే అవుట్ డోర్ గేమ్స్ ఆడాలని... అలాగయితేనే పోటీతత్వం పెరిగి ఓటమిని స్వీకరించే తత్వం అలావాటవుతుందన్నారు. క్రీడాస్ఫూర్తి అలవాటు కాకపోవడం వల్లే పరీక్షల్లో పాస్ కాకపోతేనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. కాబట్టి పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లినట్లే గ్రౌండ్ కు తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రులదేనని హరీష్ పేర్కొన్నారు.