పుట్టింటికి అని చెప్పి.. ప్రియుడితో గోవా చెక్కేసిన భార్య
జీపీఎస్ తో కనిపెట్టిన భర్త
పుట్టింటికి వెళ్తానని భర్తకి చెప్పి... ఓ వివాహిత గోవా చెక్కేసింది. కాగా.. ఆ భార్య గోవా వెళ్లిన విషయాన్ని ఎంతో తెలివిగా జీపీఎస్ టెక్నాలజీతో భర్త కనిపెట్టాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన వ్యాపార నిమిత్తం తరుచూ నెల్లూరు, విజయవాడకు క్యాంపులకు వెళ్తుంటాడు. ఆయన లేని సమయంలో భార్య వ్యాపార పనులు నిర్వహించేది. కాగా ఓ రోజు కారు వాష్ చేయించేందుకు వెళ్లిన ఆమెకు అవివాహితుడైన ఆ షాపు యజమాని మాధవ్(25)తో పరిచయం ఏర్పడింది.
ఆవిడ కంటే మాధవ్ వయసులో 10 ఏళ్లు చిన్నవాడు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రియుడి ధ్యాసలో భర్త, పిల్లల్ని సైతం పట్టించుకునేది కాదు. అయితే ఓ రోజూ వారిద్దరూ అమీర్పేటలోని ఓ ఇంట్లో రహస్యంగా కలుసుకోవడం భర్త గమనించి, వారిని నిలదీశాడు. దీంతో బెంబేలెత్తిపోయిన భార్య తను ఇక ఇలాంటి తప్పు చేయనని, తనను మన్నించాలని భర్తను వేడుకుంది.
కొద్ది రోజులు తన పుట్టింటికి వెళ్లిపోతానని భర్తకు చెప్పింది. అయితే భార్య మీద ఇంకా అనుమానం తీరని భర్త ఆవిడ కారుకు జీపీఎస్ అమర్చాడు. పుట్టింటికని చెప్పి కారులో బయల్దేరిన ఆవిడ.. ప్రియుడితో కలిసి గోవాకు చెక్కేసింది. గోవాలో ఓ హోటల్లోకి కారు చేరుకున్నట్టు జీపీఎస్ ద్వారా తెలసుకున్న భర్త.. వెంటనే ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో భార్యపై కేసు నమోదు చేశాడు.
తనని మోసం చేసి నమ్మకద్రోహానికి పాల్పడ్డ తన భార్యను, ఆమె ప్రియుడు మాధవ్ను పట్టుకోవాలని పోలీసుల్ని వేడుకుంటున్నాడు. కూతుళ్లు తన భార్య దగ్గర ఉంటే చెడుదోవలోకి వెళ్లే ప్రమాదం ఉందని, కాబట్టి పిల్లల్ని తనకు అప్పగించాలని ఫిర్యాదులో పోలీసులను కోరాడు.