Asianet News TeluguAsianet News Telugu

దిండి ఎత్తిపోతల తొలి ఫలాలు రైతులకు అందాలి : మంత్రి హరీష్ రావు

మంత్రి సమీక్ష

minister hairsh rao review on dindi irrigation project

దిండి ఎత్తిపోతల పథకం తొలి ఫలాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. జల సౌధలో  ఎన్.ఎస్. పీ లిఫ్ట్ ఇరిగేషన్ పై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాల గూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు పాల్గొన్నారు.

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ హైలెవల్ కెనాల్ - 8 , 9 లో 23 కిలోమీటర్లు తర్వాత దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని అధికారులు ఈ సమీక్షలో మంత్రి హరీష్ రావుకు తెలిపారు. చలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2 వేల ఎకరాల ఆయకట్టుకు డీప్ కట్ ఉండటం ద్వారా నీటి పంపింగ్ లో అంతరాయం కలుగుతోందని వివరించారు. దీన్ని అధిగ మించేందుకు లో లెవల్ కెనాల్ పంప్ హౌస్ లోని మూడు పంపుల్లో... ప్రత్యామ్నాయంగా ( స్టాండ్ బై) ఉన్న పంపు ఉపయోగించి డి-8,9 కు అనుసంధానం చేసేలా ప్రతిపాదనలు పంపాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.

 ఎన్. ఎస్. పీ పుట్టంగండి నుంచి అక్కంపెల్లి బాలెన్సింగ్  రిజర్వాయర్ కు గల 9.3 కిలోమీటర్ల లింక్ కెనాల్, అక్కడి నుంచి కోదండాపూర్ రిజర్వాయర్ వరకు గల 2 కిలోమీటర్ల వరకు నిరంతరం హైదరాబాద్ కు పంపింగ్ స్కీం ద్వారా తాగు నీరు అందిస్తున్నారని.. ఇది నిరంతరం జరగడం వల్ల కెనాల్ కోతకు గురవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. కెనాల్ వెంబడి ఉన్న రోడ్డు కోతకు గురయి తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు లైనింగ్ పనులు చెపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో పాటు ఎ.ఎమ్. ఆర్. పీ కెనాల్ లైనింగ్ ఉదయసముద్రం కింది వరకు ఉండేలా ప్రతిపాదనలు తయారు  చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు.

మిర్యాల గూడ నియోజకవర్గంలోని దున్నపోతుల గండి, నూతన పాలెం, కేశవాపురం  లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు సంబంధించి టెయిల్ ఎండ్ ఆయకట్టును స్థిరీకరించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ట్రైబల్ సబ్ ప్లాన్ కింద పనులు చేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.

దిండి ఎత్తిపోతల పథకం లోభాగమయిన గొట్టి ముక్కల రిజర్వాయర్ ద్వారా తొలి ఫలాలు రైతులకు అందేలా చూడాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.  ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని, కాలువల పనులను అక్టోబర్ - నవంబర్ లోగా పూర్తి చేసేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 ఈ సమీక్షలో ఈఎన్ సీ మురళీధర్, ఎన్. ఎస్. పీ. సీఈ   ఎస్. సునీల్, ఎన్. ఎస్. పీ ఎస్. ఈ నర్సింహం, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్. ఈ వెంకటేశం, ఈఈలు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios