Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లీష్ మీడియం జీవో కొట్టివేత: వైఎస్ జగన్ చేసిన తప్పు ఇదే!

ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధనను(1-6వ తరగతి వరకు) తప్పనిసరి చేస్తూ తీసుకు వచ్చిన జీవోలను హై కోర్టు కొట్టివేసింది. ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్ప వేరే మాధ్యమం ఉండదు అని తీసుకువచ్చిన జివోలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య చట్టంలో కూడా సవరణలను చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. 

Highcourt strikes down compulsory english medium GO's, the reason
Author
Amaravathi, First Published Apr 18, 2020, 6:18 PM IST

కరోనా వైరస్ మహమ్మారి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇవన్నీ వెరసి ఒక ముఖ్యమైన హై కోర్టు తీర్పు పై జరగాల్సినంత చర్చ జరగలేదు. దానికి దక్కాల్సినంత మీడియా ప్రైమ్ టైం కూడా దక్కలేదు. 

ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధనను(1-6వ తరగతి వరకు) తప్పనిసరి చేస్తూ తీసుకు వచ్చిన జీవోలను హై కోర్టు కొట్టివేసింది. ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్ప వేరే మాధ్యమం ఉండదు అని తీసుకువచ్చిన జివోలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య చట్టంలో కూడా సవరణలను చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. 

కానీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఈ జీవోలను కొట్టి వేస్థుతీర్పునిచ్చింది. ఈ విషయమై ఒకింత చర్చ జరిగినప్పటికీ... విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యవహారం ముందు ఈ విషయం చాలా చిన్నదైపోయింది. 

వాస్తవానికి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం అన్ని విధాలా అభినందనీయం. చాలా మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించకుండా ఉండడానికి, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని అప్పు చేసైనా సరే ప్రైవట్ర్ పాఠశాలల్లో చదివించడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడమే. 

ఇంగ్లీష్ భాష ప్రయోజనాల గురించి మనం వేరుగా చెప్పనవసరం లేదు. ప్రపంచమంతా ఇదే భాషలో వాణిజ్య వ్యాపారాలు సాగిస్తున్న విషయం తెలిసిందే! లాంగ్వేజ్ అఫ్ గ్లోబల్ కామర్స్ నుంచి మొదలు లాంగ్వేజ్ అఫ్ కామన్స్ అని రకరకాల పేర్లతో ఇంగ్లీష్ భాషను ముద్దుగా పిలిచే విషయం మనందరికీ తెలిసిందే. 

ఇంగ్లీష్ భాష రావడం వల్ల ఉద్యోగాల్లో దూసుకుపోతున్నవారు చాలామంది ఉన్నారు. భారతదేశంలో విదేశీ కంపెనీలు ముఖ్యంగా సేవల రంగం(సర్వీసెస్ సెక్టార్) విస్తరించడానికి కారణం ఇంగ్లీష్ భాషే. 

మనపొరుగున ఉన్న చైనాలో నైపుణ్యత కలిగిన ఉద్యోగులు భారతదేశం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ మంది ఉన్నప్పటికీ... వారికి ఇంగ్లీష్ భాష రాకపోవడం భారత దేశానికి ఒక వరంగా పరిణమించిందని చెప్పవచ్చు. 

ఇంగ్లీష్ భాషతో ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ... ఇలా ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడం వల్ల విద్యార్థులకు అర్థం కాకపోవచ్చని, తెలుగు భాష అంతరించిపోతుందని, నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు లేరని ఇలా అనేక వాదనలు కూడా ముందుకొచ్చాయి. ఇందులో కొన్ని వాదనల్లో నిజం కూడా లేకపోలేదు. 

భాష అంతరించిపోవడానికి మాధ్యమానికి అంత సంబంధం లేదు. తెలుగు భాష తప్పనిసరి అని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతానికి తెలుగు భాషకు వచ్చిన నష్టమయితే ఏమి లేదు. 

కాకపోతే ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభిస్తే దాన్ని బోధించడానికి సరైన ఉపాధ్యాయులు ఉన్నారా అనేది ఒక ప్రశ్న. ఉపాధ్యాయులు దొరికినా వారంతా ప్రాథమిక విద్యాబోధనకు ట్రైనింగ్ పొందిన టీచర్లా లేక పై తరగతులకు చెప్పేవార అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. 

మన టీచర్లలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు అని రెండు రకాల టీచర్లు ఉంటారు. ఎస్జీటీలు కింద తరగతులకు చదువు చెబితే... స్కూల్ అసిస్టెంట్లు పై తరగతులకు విద్యను బోధిస్తారు. 

ఇప్పుడు ఇలా ఇంగ్లీష్ మీడియంలో ప్రాథమిక విద్యను బోధించగలిగేంతమంది టీచర్లు ఉన్నారా అనేది ప్రధాన సమస్య. టీచర్లకు ఇంగ్లీష్ రాకపోయినా, ఒకవేళ ఇంగ్లీష్ లో చెప్పగలిగినా వారు గనుక ప్రాథమిక విద్యను బోధించడంలో శిక్షణ పొంది లేకపోతే దండగే అవుతుంది. 

ఇవన్నీ పక్కకుంచితే.... కేవలం ఇంగ్లీష్ మాధ్యమాన్ని మాత్రమే అందుబాటులో ఉంచడం ఇక్కడ వచ్చిన అసలు సమస్య. దీనివల్ల రెండు ప్రశ్నలు ముఖ్యంగా ఉద్భవిస్తున్నాయి. ఇంగ్లీష్ మాధ్యమం వద్దు అనుకునే వారికి వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. దానితో పాటుగా ఒక విద్యార్ధికి ప్రాథమికంగా ఉండే విద్య హక్కుకు భంగం వాటిల్లుతుంది. 

ఆ సదరు విద్యార్థి చదువుకుందామనుకున్న మాధ్యమంలో చదువు అందుబాటులో ఉండక చదువు మానేసే ఆస్కారం కూడా లేకపోలేదు. ఇలా విద్యార్థులు చదువును మానేసే ఆస్కారం ఉన్నందున, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగే వీలున్నందున హై కోర్టు కేవలం ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే విద్య బోధనా అనే విషయాన్నీ తప్పుబట్టి ప్రభుత్వ జీవోలను కొట్టివేసింది. 

ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీమ్ తలుపుతట్టే ఆలోచనలో ఉంది. వేచి చూడాలి సుప్రీమ్ ఈ విషయంగా ఎటువంటి తీర్పునిస్తుందో...!

Follow Us:
Download App:
  • android
  • ios