బిజెపికి షాకిచ్చిన కాటసాని : జగన్ సమక్షంలో వైసిపిలో చేరిక
బిజెపికి షాకిచ్చిన కాటసాని : జగన్ సమక్షంలో వైసిపిలో చేరిక
ప్రత్యేక హోదా ఉద్యమంతో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ పై పట్టు కోల్పోతున్న బిజెపికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీనుండి ఇప్పటికే వలసలు మొదలవగా తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీని వీడారు. గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగినట్లే కృష్ణాజిల్లా పాణ్యం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బిజెపి కి గుడ్ బై చెప్పారు. ఆయన ఇవాళ తన అనుచరులతో జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో వైసిపి అద్యక్షులు వైఎస్ జగన్ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను కనుమూరు సమీపంలో కాటసాని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కాటసానికి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కాటసాని తో పాటు ఆయన సన్నిహితులు, అనుచరులు వైసిపి కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ...జగన్మోహన్ రెడ్డి తో కలిసి పనిచేయడానికే పార్టీలో చేరానని, ఆయనంటే తనకెంతో అభిమానమని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చడంలో అధికార పార్టీ విఫలమైందని అందువల్లే జగన్ తో కలిసి ప్రజల పక్షాన పోరాడతానని కాటసాని స్పష్టం చేశారు.