విదేశీ మహిళపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల రావడంతో ముంబాయిలోని కళ్యాణ్ రైల్వే పోలీసులు ఓ ఆర్మీ జవానును అరెస్టు చేశారు. బాధితురాలు ఇండియన్ ఎంబసీ కార్యాలయంలో ఫిర్యాాదు చేశారు. వారు ఆ ఫిర్యాదును ఇక్కడి పోలీసులకు పంపించారు. ఈ నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

మూడేళ్ల క్రితం ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ విదేశీయురాలిపై అత్యాచారానికి పాల్పడ్డార‌న్న ఆరోపణలపై ఓ ఆర్మీ జవాన్ (Army jawan) ను రైల్వే పోలీసు అరెస్ట్ చేశారు. నిందితుడిని కేరళకు చెందిన సతీష్ (Sateesh) గా గుర్తించారు. పక్కా సమాచారం మేరకు మహారాష్ట్రలోని థానే జిల్లాలో కళ్యాణ్ పోలీసులు సతీష్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

2019 ఫిబ్రవరిలో కళ్యాణ్ - కసరా (Kalyan Kasara) స్టేషన్ మధ్య గోవా-నిజాముద్దీన్ (Goa-Nizamuddin) ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న పోర్చుగీస్ మహిళ పై ఆర్మీ జ‌వాన్ వేధింపులకు పాల్పడ్డార‌ని పీటీఐ నివేదిక పేర్కొంది. బాధితురాలు ఉన్న కంపార్ట్‌మెంట్‌లోనే నిందితుడు ఆర్మీ జవాన్ ప్రయాణిస్తున్నాడని కళ్యాణ్ రైల్వే పోలీస్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ శార్దూల్ వాల్మీకి తెలిపారు. 

ఈ ఘటనపై బాధితురాలు భారత రాయబార ( Indian Embassy) కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును రాయ‌బార కార్యాయ‌లం విచారణ కోసం కళ్యాణ్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు పంపించింది. సీసీటీవీ ఫుటేజీ, విదేశీయురాలు అందించిన వివరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న నిందితుడు కళ్యాణ్ సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే కోర్టు అతని బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. అనంత‌రం అతను హైకోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా కోర్టు ఆయ‌న బెయిల్ పిటిష‌న్ ను తిర‌స్క‌రించింది.