కశ్మీర్ అంశానికి సంబంధించి వేర్పాటువాదులకు మద్దతుగా హ్యూందాయ్, Pizza Hut, కేఎఫ్సీ.. చేసిన పోస్టులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సంస్థలు భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు కోరడం చేస్తున్నాయి.
కశ్మీర్ అంశానికి సంబంధించి వేర్పాటువాదులకు మద్దతుగా హ్యూందాయ్, Pizza Hut, కేఎఫ్సీ.. చేసిన పోస్టులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్లోని ఈ సంస్థలకు చెందిన సోషల్ హ్యాండిల్స్ నుంచి కశ్మీర్ సంఘీభావ దినం(ఫిబ్రవరి 5) వేర్పాటుదారులకు మద్దుతగా పోస్టులు చేయడమే ఇందుకు కారణం. భారతీయ నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో.. సదురు సంస్థలు భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, కేఎఫ్సీ, పిజ్టా హట్లు విచారం, క్షమాపణలు వ్యక్తం చేయగా.. తాజాగా పిజ్జా సైప్లె చైన్ డొమినోస్, హోండా, మారుతి సుజుకీ కూడా అదే భాటలో ప్రయాణించాయి. పాకిస్తాన్లోని తమ వ్యాపార సహచరులు చేసిన సోషల్ మీడియా పోస్ట్ల కారణంగా భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేవాయి.
హ్యుందాయ్ కశ్మీర్లోని వేర్పాటువాదులకు మద్దతు ఇస్తూ చేసిన ట్వీట్కు వివరణ ఇచ్చిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటనలు వెలువడ్డాయి. భారతీయ మార్కెట్కు కట్టుబడి ఉన్నామని.. దేశ ప్రజలు, సంస్కృతి పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని డొమినోస్ ఇండియా తెలిపింది. ‘డొమినోస్ ఇండియా భారతీయ మార్కెట్కు కట్టుబడి ఉంది. 25 సంవత్సరాలకు పైగా భారత్ను ఇళ్లుగా భావిస్తున్నాం. దేశ ప్రజలు, సంస్కృతి, జాతీయవాద స్ఫూర్తికి అత్యంత గౌరవం ఉంది’ అని కంపెనీ ట్విట్టర్లో ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక, భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు చింతిస్తున్నామని హోండా ఇండియా కూడా ట్విట్టర్లో క్షమాపణలు చెప్పింది. తాము పనిచేసే ప్రతి దేశం యొక్క చట్టాలు, మనోభావాలకు లోబడి ఉండటానికి కట్టుబడి ఉన్నామని హోండా సంస్థ పేర్కొంది. తమ పాలసీలో భాగంగా.. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా, జాతి, రాజకీయాలు, మత, సామాజిక సమస్యలపై వ్యాఖ్యానించకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.
‘సుజుకీ మోటార్ కార్పోరేషన్ దాని ఉత్పత్తులు, సేవలు, నైతిక వ్యాపార ప్రవర్తన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా సామాజిక బాధ్యత ప్రయత్నాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశ్వసించే, విశ్వసించబడే కంపెనీగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. కార్పోరేట్ విధానంగా.. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ మేము ఎలాంటి రాజకీయ, మతపరమైన అంశాలపై కలుగజేసుకోం. ఇటువంటి విషయాలపై మా డీలర్లు లేదా వ్యాపార సహచరుల నుంచి ఎటువంటి పోస్టులు చేసిన దానిని కంపెనీ ఆమోదం ఉండదు’ అని మారుతి సుజుకీ పేర్కొంది. భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు చింతిస్తున్నామని తెలిపింది.
అయితే అసలు వివాదం ఎలా మొదలైందంటే..
ఫిబ్రవరి 5వ తేదీన పాకిస్తాన్లో కశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంస్మరణ దినాన్ని జరుపుకుంటారు. అయితే అదే రోజు.. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్ (@HyundaiPakistanOfficial) ఓ పోస్టు కనిపించింది. ‘మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుచేసుకుందాం. వారు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు మద్దతుగా నిలబడదాం. #HyundaiPakistan #KashmiriSolidarityDay’ అని పోస్ట్ చేసింది. ఆపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తంకాగా.. ఆ పోస్టులు తొలగించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిగిలిన కంపెనీలు కూడా కొన్ని ఇదే రకమైన పోస్టులు చేయడంతో.. వాటిని కూడా బాయ్కాట్ చేయాలని భారతీయ నెటిజన్లు డిమాండ్ చేశారు.
