ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ బ్రిటన్ మీడియా సంచలన కథనం ప్రసారం చేసింది. అనుకోని పరిస్ధితుల్లో అణు యుద్ధం జరిగినప్పటికీ ప్రమాదం లేకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కుటుంబాన్ని భద్రతా దళాలు రహస్య ప్రాంతానికి తరలించినట్లుగా కథనాలు ప్రసారం చేస్తోంది

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (vladimir putin) తన కుటుంబ సభ్యుల్ని రహస్య ప్రాంతానికి తరలించినట్టు బ్రిటన్‌కు చెందిన ఓ వార్తా సంస్థ కథనం ప్రసారం చేసింది. ఒకవేళ అణుయుద్ధం జరిగినా సురక్షితంగా ఉండేలా సైబీరియా ప్రాంతంలో ఓ బంకర్‌ని ఏర్పాటు చేసినట్టు కథనంలో పేర్కొంది. అట్లయ్‌ పర్వత ప్రాంతంలో అత్యాధునిక వసతులతో రూపొందించిన బంకర్‌కు పుతిన్‌ తన కుటుంబ సభ్యుల్ని తరలించారని బ్రిటన్‌ మీడియా తెలిపింది. మరోవైపు, పుతిన్‌ కొంత కాలంగా మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నారని ఆ వార్తా సంస్థ ఆరోపించింది. అయితే దీనిపై రష్యా ప్రభుత్వ వర్గాలు స్పందించాల్సి వుంది. 

ఇకపోతే.. రేపు ఉక్రెయిన్- రష్యా మధ్య రెండో విడత చర్చలు (ukraine russia peace talks) జరగనున్నాయి. నిన్న బెలారస్ వేదికగా (belarus) సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. రెండు దేశాల రక్షణ మంత్రుల బృందం ఈ చర్చల్లో పాల్గొంది. రష్యా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. క్రిమియా నుంచి కూడా బలగాలను వెనక్కి తీసుకోవాలని ఉక్రెయిన్ పట్టు పట్టింది. వెంటనే కాల్పులు విరమించుకోవాలని కోరింది. అయితే నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది రష్యా. 

మరోవైపు.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (ukraine ) నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోని బలమైన కూటమిలలో ఒకటైన యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం లభించింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఉక్రెయిన్ దరఖాస్తుకు ఆమోదం లభించడం విశేషం. స్పెషల్ అడ్మిషన్ కేటగిరీలో ఉక్రెయిన్ కు సభ్యత్వం వచ్చింది. ప్రస్తుతం ఈయూలో మొత్తం 27 సభ్య దేశాలు ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ చేరికతో ఈ సంఖ్య 28కి చేరనుంది. 

రష్యాతో దురాక్రమణ తర్వాత నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈయూ సభ్యత్వానికి సంబంధించి దరఖాస్తుపై జెలెన్ స్కీ సంతకం చేశారు. మరోవైపు రష్యాను ఎదుర్కొనేందుకు ఈయూ కలిసి రావాలిని.. సహాయం చేయాలని జెలెన్ స్కీ కోరుతున్నారు. ఇప్పటికే పలు యూరోపియన్ దేశాల నుంచి ఆయుధ, సైనిక సహాయం అందుతోంది. 

అంతకుముందు యూరోపియన్ యూనియన్ (european union) పార్లమెంట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (volodymyr zelensky) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈయూ దేశాలు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం విశేషం. జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాకు లొంగిపోయే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. మా సత్తా ఏంటో నిరూపించుకుంటామని.. ఈ పోరాటంలో విజయం సాధిస్తామని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. రష్యా సేనలతో తమ పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారని.. ఈ పోరాటంలో ఎంతవరకైనా వెళ్తామని జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యా బాంబు దాడుల్లో 16 మంది చిన్నారులు చనిపోయారని.. అసలు పుతిన్ (putin) లక్ష్యమేంటీ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రశ్నించారు. ఈయూ దేశాలు మద్ధతిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.