రష్యా సేనలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రజలకు కూడా ఆయుధాలు ఇవ్వడం ఉక్రెయిన్కు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. అత్యాధునిక ఆయుధాలు నేరగాళ్ల చేతుల్లోకి రావడంతో నేరాలు, దారుణాలు పెరుగుతున్నాయి.
ఉక్రెయిన్- రష్యాల మధ్య పోరు భీకరంగా సాగుతోంది. కీలక నగరాలను స్వాధీనం చేసుకోవాలనే రష్యా ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రజలు ఆయుధాలు ధరించి యుద్ధంలో దిగుతున్నారు. దీంతో ఉక్రెయిన్ ఆక్రమణ రష్యాకు కత్తిమీద సాములా మారింది. రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉక్రెయిన్పై మాస్కోకు పట్టు చిక్కడం లేదు. దీంతో పుతిన్ (putin) అసహనానికి గురవుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (volodymyr zelensky) అంతర్జాతీయ దౌత్యం ద్వారా రష్యాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఈయూ పార్లమెంట్ ఆమోదం కూడా తెలిపింది.
రష్యా సేనలతో పోరాడేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రజలకు ఆయుధాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి దుర్మార్గులు, నేరస్తుల చేతుల్లో పడటంతో దుర్వినియోగం అవుతున్నాయి. ఉక్రెయిన్ రచయిత గొంజలో లిరా చెబుతున్నది వింటే ఇది నిజమే అనిపిస్తోంది.
జెలెన్ స్కీ యంత్రాంగం గడిచిన కొన్ని రోజులుగా సైనిక శ్రేణి ఆయుధాలను ఇస్తుండడంతో అవి చాలా మంది నేరస్థుల చేతుల్లోకి వెళ్లాయని ఆయన చెప్పారు. వాటితో వారు దోపిడీలు, అత్యాచారాలు సహా అరాచకాలకు పాల్పడుతున్నారు అంటూ గత నెల 28న రచయిత లిరా ఒక వీడియోను విడుదల చేశారు. కీవ్లో గత రాత్రి వినిపించిన కాల్పులన్నీ కూడా రష్యన్లు చేసినవి కావని ఆయన అంటున్నారు. రష్యా సైన్యం 10 కిలోమీటర్ల దూరంలో ఉందని.. ఇవన్నీ ముఠాలు చేసినవే అయి ఉండొచ్చు అని లిరా అభిప్రాయపడ్డారు.
మరోవైపు.. ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దాడులు చేస్తూనే ఉన్నది. బాంబులు వేయడంలో వెనకడుగు వేయడం లేదు. బుధవారం ఏడో రోజుకు చేరిన ఈ యుద్ధం(Warలో ఖార్కివ్(Kharkiv) నగరంపై బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఈ రోజు 21 మంది మరణించారు. కాగా, సుమారు 100 మంది గాయాలపాలయ్యారు. ఇదిలా ఉండగా, ఖార్కివ్లోని ఓ మెటర్నిటీ కేంద్రంపై వైమానిక దాడులు చేయడం బాధాకరంగా మారింది. ఖార్కివ్లోని జైటోమిర్లోని మెటర్నిటీ హోంపై బాంబులు వేసింది. ఈ దాడిలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్లో కీవ్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ ఈ రోజు బాంబులతో దద్దరిల్లిపోతున్నది. నికోలేవ్ ఏరియా మొత్తం బాంబుల కారణంగా ఏర్పడ్డ పొగదుప్పటితో కప్పుకుపోయింది. ఖెర్సాన్ సిటీ మొత్తంగా రష్యా ఆర్మీ అధీనంలోకి వెళ్లినట్టు తెలిసింది. దీన్ని స్థానిక అధికారులు ధ్రువీకరించలేదు. కానీ, రష్యా ఆర్మీ మాత్రం ఖెర్సాన్ సిటీని తాము స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు.
రష్యా దాడులు ఏడో రోజుకు చేరడంతో వాట్సాప్లో హెల్ప్లైన్ నెంబర్ను ప్రవేశపెట్టింది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను, ముఖ్య మైన సమాచారం, సలహాలను ప్రజలకు ఈ హెల్ప్లైన్ ద్వారా చేరవేయనుంది. నిన్న రష్యా మొత్తం ఖార్కివ్పైనే ఫోకస్ పెట్టింది. షెల్లింగ్ దాడులతో విరుచుకుపడింది. ఈ రోజు ఏకంగా రష్యా పారాట్రూపులు ఈ నగరంలో కాలుమోపాయి. రష్యా వైమానిక దళ సిబ్బంది ఖార్కివ్ నగరంలో దిగిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. వారు దిగీదిగగానే స్థానిక హాస్పిటల్ను ధ్వంసం చేశారని వివరించింది. ఇక్కడ యుద్ధం ఇంకా కొనసాగుతున్నదని పేర్కొంది.
