నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. నేపాలి కాంగ్రెస్కు చెందిన రామ్ చంద్ర పౌడెల్.. దేశ మూడో అధ్యక్షుడిగా నిలిచారు.
నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. నేపాలి కాంగ్రెస్కు చెందిన రామ్ చంద్ర పౌడెల్.. దేశ మూడో అధ్యక్షుడిగా నిలిచారు. నేపాల్ నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఈరోజు చట్ట సభ్యులు ఓటు హక్కును వినియోగించుకన్నారు. నేపాల్లోని న్యూ బనేశ్వర్లోని పార్లమెంట్ భవనంలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. 2008లో రిపబ్లిక్గా అవతరించిన తర్వాత నేపాల్లో జరుగుతున్న మూడో అధ్యక్ష ఎన్నిక ఇది. అధ్యక్ష పదవి కోసం నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్)తో కూడిన ఎనిమిది పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా రామ్ చంద్ర పౌడెల్, సీపీఎన్-యూఎంఎల్ అభ్యర్థిగా సుభాష్ చంద్ర నెంబంగ్లు పోటీ పడ్డారు.
ఇందులో రామ్ చంద్ర పౌడెల్.. 214 మంది పార్లమెంటు శాసనసభ్యులు, 352 ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లను పొందారు. ‘‘అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నా స్నేహితుడు రామ్ చంద్ర పౌడెల్జీకి హృదయపూర్వక అభినందనలు’’ అని నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబా ట్వీట్ చేశారు.
ప్రెసిడెంట్ ఎన్నిక కోసం మొత్తం ఓటర్ల సంఖ్య 882. ఇందులో 332 మంది పార్లమెంటు సభ్యులు కాగా.. ఏడు ప్రావిన్సుల ప్రావిన్షియల్ అసెంబ్లీల సభ్యులు 550 మంది ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో 518 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు, 313 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు వేసినట్లు ఎన్నికల సంఘం ప్రతినిధి శాలిగ్రామ్ తెలిపారు. ఇక, నేపాల్ ప్రస్తుత అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ పదవీ కాలం మార్చి 12తో ముగియనున్న సంగతి తెలిసిందే.
