IMD Rain Alert : ఇక కుండపోత వానలే... తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలమే
Heavy Rain Alert : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మొత్తం రుతుపవనాలు విస్తరించాయి. దీంతో ఇకపై భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని… కొన్ని ప్రాంతాల్లో అతలాకుతలం తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు..
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి... జూన్ 6న ప్రవేశించి జూన్ 15 నాటికి అన్ని ప్రాంతాలను తాకాయి. అంటే ఇక వర్షాకాలం జోరందుకున్నట్లే. రుతుపవనాలకు ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు కూడా తోడయ్యాయి. దీంతో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
జూన్ 15న (మంగళవారం) పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.
కోస్తాంధ్ర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఓవైపు వర్షాలతో పాటు ఎండలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
తెలంగాణలో వర్షాలు..
రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సాయంత్రం లేదా రాత్రి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మరికొద్దిసేపట్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపు (జూన్ 16, మంగళవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇలా తెలంగాణలో వర్షాలు జోరందుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
జూన్ 18 నుండి 20 వరకు జోరువానలు..
తెలంగాణలో రెండ్రోజుల్లో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా జూన్ 18 (గురువారం) నుండి 20 (శనివారం) వరకు తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

