కథ అడ్డం తిరిగింది.. కేసుల్లో నుండి బయటపడాలని మరో మర్డర్.. చివరికి...
ఉత్తర్ ప్రదేశ్ లో ఓ భార్యభర్తలు చేసిన ఘాతకం వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది. తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారని మళ్లోసారి రుజువు చేసిందో ఘటన. వివరాల్లోకి వెడితే..
ఉత్తర్ ప్రదేశ్ లో ఓ భార్యభర్తలు చేసిన ఘాతకం వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది. తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఎంత దుర్మార్గానికైనా ఒడిగడతారని మళ్లోసారి రుజువు చేసిందో ఘటన. వివరాల్లోకి వెడితే..
ఉత్తరప్రదేశ్ లో అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి కేసు నుంచి దారుణానికి ఒడిగట్టి, అడ్డంగా దొరికిపోయాడు. అచ్చు సినిమా రేంజ్ లో మిస్టరీ క్రియేట్ చేసి, పక్కా ప్లాన్ ప్రకారం పథకం రచించాడు. కానీ దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నాడు.
రాజ్ కుమార్ అత్యాచారం హత్య కేసుల్లో నిందితుడిగా జైలుశిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్ మీద బైటికి వచ్చాడు. అయితే కేసుల భయం వెంటాడుతుండడంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తన ఐడెంటిటీని మాయం చేయాలనుకున్నాడు. భార్య, స్నేహితులతో స్కెచ్ వేశాడు.
తన ఒడ్డు, పొడుగు ఉండే వ్యక్తిని చూసి చంపేస్తే తన ఐడెంటిటి మాయం చేయచ్చు అనుకున్నాడు. సినిమాల్లో చూపించినట్టుగానే ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో సెప్టెంబరు 23న బులంద్షహర్లో ఓ మద్యం దుకాణం వద్ద మత్తులో జోగుతున్న ఓ వ్యక్తికి డబ్బు ఆశ చూపించాడు. డబ్బులిచ్చి ఇంకా తాగాలని ప్రోత్సహించాడు. తన బట్టలు కూడా ఇచ్చి వేసుకోమన్నాడు.
ఎవరో ధర్మ ప్రభువు అనుకున్న ఆ బాధితుడు సంతోషంగా వేసుకున్నాడు. ఆ తర్వాత కుమార్ భార్య, అనుచరుడు కూడా ముందు వేసుకున్న పథకం ప్రకారం అక్కడికి చేరుకున్నారు. ముగ్గురూ కలిసి బాధితుడిని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి హతమార్చారు.
ఆ తర్వాత బాధితుడి జేబులో కుమార్ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు పెట్టారు. ముఖం ఆనవాలు తెలియకుండా బండరాళ్లతో నుజ్జునుజ్జు చేశారు. ఆ తర్వాత కుమార్ అక్కడి నుంచి పరారై అజ్ఞాతంలోకి వెళ్లగా, సహ నిందితులు తమ తమ ఇళ్లకు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో గుర్తు తెలియని శవం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద దొరికిన కార్డుల ఆధారంగా అది కుమార్దేనని భావించారు.
అయితే ఎందుకో అనుమానం వచ్చి, లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. దీంతో కుమార్ ఇంటికి వెళ్లి అతడి భార్యను గట్టిగా ప్రశ్నించారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుమార్ ను అలీఘడ్లో అరెస్టు చేశారు. అతడికి సహకరించిన భార్య, అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై గతంలో హత్య, అత్యాచారం కేసు నమోదైందని, తన స్థానంలో మరో వ్యక్తి శవాన్ని పెట్టి, తన గుర్తింపును మాయం చేసేందుకే కుమార్ ఈ నేరానికి పాల్పడ్డట్లు వెల్లడించారు.