కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. ఎవరీ స్వప్న సురేష్..?
ఎయిర్ ఇండియా ఉద్యోగం మానేసిన తర్వాత.. యూఏఈ కాన్సులేట్లో ఒక కీలక పదవిలో నియమితులయ్యారు. అక్కడే ఆమె పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కేరళ దౌత్య వేత్తలతో పరిచయాలు పెంచుకున్నారు.
కేరళలోని తిరువునంతపురానికి 30 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిన కేసు తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. కాగా... నిందితుల్లో కీలకంగా స్వప్న సురేష్ అనే మహిళ పేరు ఎక్కువగా వినపడుతోంది. ఈ క్రమంలో అసలు ఎవరీ స్వప్న సురేష్ అనే విషయం అందరినీ ఆకట్టుకుంటోంది.
కేరళకు చెందిన స్వప్న తండ్రి అబుదాబిలో స్థిరపడ్డారు. దీంతో అక్కడే జన్మించిన స్వప్న చిన్నప్పటి నుంచి విషయ పరిజ్ఞానం పెంచుకోవడంలో చురుకుగా ఉండేవారు. అబుదాబిలోనే చదువుకున్న స్వప్న.. అక్కడే విమానాశ్రయంలో ఉద్యోగం సంపాదించారు.
అక్కడ ప్రయాణికుల సేవా విభాగం గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇండియా వచ్చిన స్వప్న.. రెండేళ్లపాటు ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత 2013లో తిరునంతపురం ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ఇండియా సాట్స్లో ఉద్యోగం పొందారు.
అయితే అక్కడ ఒక అధికారిని తప్పుడు కేసులో ఇరికించడం కోసం నకిలీ పత్రాలు సమర్పించడంతో స్వప్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణకు కూడా స్వప్న సహకరించలేదని సమాచారం.
ఎయిర్ ఇండియా ఉద్యోగం మానేసిన తర్వాత.. యూఏఈ కాన్సులేట్లో ఒక కీలక పదవిలో నియమితులయ్యారు. అక్కడే ఆమె పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కేరళ దౌత్య వేత్తలతో పరిచయాలు పెంచుకున్నారు.
అరబిక్తో పాటు పలు భాషలపై పట్టున్న స్వప్నకు ఇది చాలా సులువుగా సాధ్యమైంది. అయితే స్వప్న అనేక అవకతవకలకు పాల్పడటంతో ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పడిన పరిచయాలతో స్వప్న కేరళ ఐటీ విభాగంలో ఉద్యోగం సంపాదించారు.
అలా సీఎంఓలోని కొందరితో పరిచయాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను అసరాగా చేసుకుని బంగారం అక్రమ తరలింపుకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితుడైన శివశంకర్కు స్వప్నతో సత్సంబంధాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తిరువనంతపురం ఎయిర్ పోర్టులో సోమవారం పెద్ద మొత్తంలో బంగారం పట్టుపడింది. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు.
దీంతో గోల్డ్ స్మగ్లింగ్కు సంబంధించి స్వప్న పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు. ఇక, ఫ్యామిలీ విషయానికి వస్తే.. భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వప్నకు ఒక కుతూరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.