పెళ్లయిన మహిళలు నుదుటిన సింధూరం ఎందుకు పెట్టుకుంటారు?
హిందూ సంప్రదాయంలో పెళ్లయిన మహిళలు నుదుటిన సింధూరం పెట్టుకుంటారు. అది ముఖానికి ఎంతో కళ వస్తుంది.అసలు ఇలా నుదుటిన సింధూరం లేదా కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు.

సింధూరం ఎంతో ముఖ్యం
హిందూ సంప్రదాయంలో సింధూరానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లైన మహిళలు పాపిట్లో సింధూరం పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది సింధూరం పెట్టుకుంటే.. మరికొందరు కుంకుమను పెట్టుకుంటారు. ఎరుపు రంగు.. శక్తి, శుభం, ప్రేమకు గుర్తుగా భావిస్తారు. భర్తకు మంచి ఆయుష్షు, కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలని కోరుకుంటూ స్త్రీలు సింధూరం ధరిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే సింధూరం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా వివాహ బంధానికి గుర్తుగా కూడా భావిస్తారు.
నుదుటి మధ్యలోనే ఎందుకు?
సింధూరాన్ని పాపిట్లో, నుదుటి మీద మధ్య భాగంలోనే ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఆధ్యాత్మిక కారణం ఉందని చెబుతారు. కనుబొమ్మల మధ్య ఉన్న ప్రాంతాన్ని భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ‘ఆజ్ఞా చక్రం’గా భావిస్తారు. ఇది ఆలోచన, ఏకాగ్రతకు సంబంధించిన ముఖ్యమైన ప్రాంతంగా చెబుతారు. అందుకే ఈ ప్రాంతంలో బొట్టు, తిలకం పెట్టుకునే ఆచారం కూడా ఉంది. సింధూరం పెట్టుకోవడం కూడా ఇదే సంప్రదాయంతో ముడిపడి ఉందని కొందరు పండితులు చెబుతున్నారు.
శాస్త్రం ఏం చెబుతోంది?
నుదుటి మధ్య భాగంలో నరాల చివరలు ఉంటాయి. ఈ ప్రాంతాన్ని తాకడం లేదా స్వల్పంగా ఒత్తిడి చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందని కొన్ని సంప్రదాయ వివరణలు చెబుతున్నాయి. అయితే సింధూరం పెట్టుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పే వాదనలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ముఖ్యంగా సింధూరం పేరుతో దొరికే ప్రతి ఉత్పత్తి ఒకే రకంగా ఉండదు. కాబట్టి రసాయనాలు లేని, నాణ్యమైన సింధూరాన్ని మాత్రమే ఉపయోగించడం మంచిది. మొత్తంగా చూస్తే సింధూరం వెనుక మతపరమైన నమ్మకాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావనలు కలిసి ఉన్నాయి.

