ఎర్రబస్సు రంగు ఎందుకు మారింది? ఆర్టిసి బస్సులకు ఆకుపచ్చ, తెలుగు రంగులే ఎందుకు వేశారు?
ఒకప్పుడు ఎర్ర బస్సు అంటే గ్రామీణ ప్రాంతాలకు నడిచే సర్వీస్. కానీ ఇప్పుడు ఈ బస్సుల స్థానంలో ఆకుపచ్చ, తెలుపు రంగులోని పల్లె వెలుగు బస్సులు వచ్చాయి. ఈ రంగు మార్పు వెనకున్న స్టోరీ ఏమిటో తెలుసా?

ఎర్రబస్సు ఎలా మారింది...
తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ప్రజా రవాణా వ్యవస్థ (RTC)కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎర్రబస్సుతో విడదీయరాని అనుబంధం ఉండేది... ఊరికి బస్సు రావడం అంటే ఒక పండుగలా ఉండే రోజులు ఆ కాలంలో ఉండేవి. ఎర్రబస్సు గ్రామీణ ప్రాంతాలకు, ప్రజలకు సింబల్ అయిపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అభివృద్ధిలో ఎందరో అధికారులు కీలక పాత్ర పోషించారు… కానీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (VC & MD)గా బాధ్యతలు నిర్వర్తించిన వి. దినేష్ రెడ్డి హయాం ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్న 'పల్లె వెలుగు' బస్సులు గ్రామీణ రవాణా వ్యవస్థలోనే ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాయి. తాజాగా ఈ బస్సుల ఏర్పాటు, వాటి వెనుక ఉన్న ఆలోచనలు, ఆసక్తికరమైన విశేషాలను ఆయన వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్, లాస్ట్ బస్సు స్టోరీ
ఒకప్పుడు గ్రామీణ జీవితం పూర్తిగా బస్సు టైమింగ్స్పైనే ఆధారపడి సాగేది. ఇప్పటి మాదిరిగా బైక్స్, కార్లు ఉండేవి కావు… ఆటోలు ఉండేవి కానీ గ్రామీణ ప్రాంతాలకు చాలా తక్కువగా నడిచేవి. దీంతో పొద్దున్నే వచ్చే 'ఫస్ట్ బస్సు'తో గ్రామంలో చలనం మొదలైతే, రాత్రికి చేరే 'లాస్ట్ బస్సు'తో రోజు ముగిసేది. చదువుకునే విద్యార్థులు, పొలానికి వెళ్లే రైతులు, వ్యాపారాలు చేసుకునే చిన్నతరహా వర్తకులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు... ఇలా ప్రతి ఒక్కరికీ ఈ బస్సులే ప్రధాన ఆధారం.
పల్లెలను నగరాలకు, పట్టణాలకు అనుసంధానించే ఏకైక వారధిగా ఆర్టీసీ బస్సులు ఉండేవి. బస్సు రాని రోజంటూ ఉంటే ఆ ఊరి పనులు, ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయే పరిస్థితి ఉండేది. అంతటి బలమైన బంధం ఉన్న ఈ ప్రయాణాన్ని గ్రామీణులకు మరింత సౌకర్యవంతంగా మార్చాలని నాటి ఆర్టిసి ఛైర్మన్ దినేష్ రెడ్డి భావించారు. అందులోంచి పుట్టుకొచ్చిందే పల్లె వెలుగు సర్వీస్.
'ఎర్ర బస్సు' నుండి 'పల్లె వెలుగు'గా పరిణామం
దశాబ్దాల పాటు పల్లెటూర్లలో 'ఎర్ర బస్సు' అంటేనే ఆర్టీసీకి ఒక గొప్ప బ్రాండ్ ఇమేజ్. ఎరుపు రంగులో ఉండే ఆర్టీసీ బస్సు రాకకోసం ఊరి చివర చెట్ల కింద ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించేవారు. అయితే కేవలం రవాణా సౌకర్యం అందించడమే కాకుండా, గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో ఒక కొత్త కాంతిని నింపాలనే ఆలోచనే బస్సు రంగును మార్చారు. పల్లె ప్రజలకు ఒక వరప్రసాదంలా ఉంటూ, వారి జీవితాల్లో చీకట్లను తొలగించి పురోగతి దిశగా వెలుగులు నింపాలనే ఉన్నతాశయంతో ఈ బస్సులకు 'పల్లె వెలుగు' అని నామకరణం చేసినట్లు అప్పటి ఆర్టిసి ఎండి దినేష్ రెడ్డి తెలిపారు. ఈ పేరు అప్పట్లో ప్రజల మనసులకు చాలా వేగంగా చేరువైంది.
పల్లె వెలుగు బస్సులకు గ్రీన్ అండ్ వైట్ రంగులే ఎందుకు?
పల్లె ప్రాంతాలకు వెళ్లే బస్సు పేరు మార్చడమే కాకుండా, దాని రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేశారు. దశాబ్దాలుగా ఆర్టీసీ బ్రాండ్గా ఉన్న ఎరుపు రంగు స్థానంలో పచ్చదనం, తెలుపు (గ్రీన్ అండ్ వైట్) కాంబినేషన్ను ప్రవేశపెట్టారు. దీని వెనుక ఒక అద్భుతమైన భావన దాగి ఉంది.
పల్లెటూర్లు అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేవి పచ్చని పంట పొలాలు. ఆ పచ్చదనాన్ని, కర్షకుల కష్టాన్ని సూచిస్తూ బస్సుకు 'పచ్చ రంగు'ను ప్రధానంగా ఎంచుకున్నారు. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరో ప్రధానమైన ఆధారం పాడి పరిశ్రమ. రైతుల ఇళ్లలోని ఆవులు, గేదెలు, పాల ఉత్పత్తికి సంకేతంగా 'తెలుపు రంగు'ను జోడించారు. పల్లెల్లోని వ్యవసాయాన్ని, పాడి పరిశ్రమను ప్రతిబింబించేలా ఈ రంగుల కలయికను తీర్చిదిద్దడం విశేషం.
ఏపిఎస్ ఆర్టిసి గిన్నిస్ బుక్ రికార్డు
కేవలం రంగు, పేరు మార్చడమే కాకుండా ప్రయాణికుల సౌకర్యాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణంగా ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో బెంచ్ వంటి సీట్లు ఉండేవి... కానీ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే గ్రామీణ ప్రజలకు కూడా మెరుగైన సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో ఎక్స్ప్రెస్ బస్సుల్లో వాడే నాణ్యమైన, సౌకర్యవంతమైన సీట్లను ఈ బస్సుల్లో అమర్చారు. దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలు చేసే రైతులకు, సాధారణ ప్రయాణికులకు అలసట తగ్గేది.
ఉమ్మడి రాష్ట్రంలో దినేష్ రెడ్డి నాయకత్వంలో APSRTC సాధించిన మరో చారిత్రక ఘనత ప్రపంచస్థాయి రికార్డు. సుమారు 20 వేల బస్సుల భారీ ఫ్లీట్తో, అతిపెద్ద ప్రజారవాణా సంస్థగా APSRTC గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది.
నేటికీ తెలుగు రాష్ట్రాల్లో 'పల్లె వెలుగు' బస్సులు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూనే ఉన్నాయి. గ్రామీణ రూపురేఖలను, ప్రజల రవాణా అలవాట్లను మార్చడంలో పల్లె వెలుగు బస్సులు పోషించిన పాత్ర అసాధారణమైనది. సాంకేతికంగా రవాణా రంగం ఎంతో ముందుకు వెళ్లినప్పటికీ, నాటి 'పల్లె వెలుగు' ఆవిర్భావం, ఐపిఎస్ దినేష్ రెడ్డి నాయకత్వంలో జరిగిన విప్లవాత్మక మార్పులు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.

