- Home
- Entertainment
- Uday Kiran: వీక్ మైండ్ ఉన్నవాళ్లు సినిమాల్లోకి రావద్దు.. ఉదయ్ కిరణ్ పై బడా నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Uday Kiran: వీక్ మైండ్ ఉన్నవాళ్లు సినిమాల్లోకి రావద్దు.. ఉదయ్ కిరణ్ పై బడా నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ఉదయ్ కిరణ్ కెరీర్ ప్రారంభంలోనే స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు రాలేదు. కెరీర్ తలక్రిందులయ్యింది. ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా దీనిపై నిర్మాత ఎంఎస్రాజు హాట్ కామెంట్ చేశారు.

ఓవర్ నైట్లో స్టార్ అయిన ఉదయ్ కిరణ్
ఉదయ్ కిరణ్ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కెరటం. హీరోగా పరిచయం కావడంతోనే సంచలనాలు సృష్టించాడు. సరికొత్త ప్రేమ కథా చిత్రాలతో కుర్రాళ్లకి బాగా దగ్గరయ్యాడు. అప్పట్లో యూత్ని ఓ ఊపు ఊపేశాడు. వరుసగా లవ్ స్టోరీస్తో విజయాలు అందుకొని తక్కువ టైమ్లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఆ రేంజ్లో స్టార్డమ్ సంపాదించడం మామూలు విషయం కాదు, ఆ విషయంలో ఉదయ్ కిరణ్ గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ వరుస పరాజయాలు ఆయన్ని కుంగదీశాయి. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యాయి.
ఉదయ్ కిరణ్ పై బడా నిర్మాత కామెంట్
అయితే ఉదయ్ కిరణ్తో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు రీసెంట్గా స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానెల్లో ఆయన మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్ అలా చేశాడని తెలిసి చాలా బాధపడ్డానని చెప్పారు. అలా చేస్తాడని తాను అస్సలు ఊహించలేదని, ఉదయ్ కిరణ్తో తాను `మనసంతా నువ్వే`, `నీ స్నేహం` వంటి చిత్రాలను రూపొందించానని వెల్లడించారు. ఆ తర్వాత కూడా తాను ఉదయ్తో సినిమా చేయాలనుకున్నాడట. కానీ ఆ సమయంలో ఆయన మరో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటంతో తనది పట్టాలెక్కలేదట. దీంతో తాను వేరే ప్రాజెక్ట్ లు చేయాల్సి వచ్చిందన్నారు.
ఉదయ్ కిరణ్ డిప్రెషన్లో ఉన్నాడని తెలియదు-ఎంఎస్ రాజు
ఆ సమయంలో ఎంఎస్ రాజు `ఆట`, `వాన`, `మస్కా` వంటి చిత్రాలు చేశారు. ఆ తర్వాత నిర్మాతగా గ్యాప్ తీసుకున్నారు. తన కొడుకు సుమంత్ అశ్విన్ని హీరోగా నిలబెట్టేందుకు నిర్మాతగా బ్రేక్ తీసుకున్నారు. అయితే ఆ సమయంలో ఉదయ్ కిరణ్ డిప్రెషన్లో ఉన్నాడని నిజంగా తనకు తెలియదన్నారు. తన కొడుకు సినిమాలకు సంబంధించిన ప్లానింగ్తో బిజీగా ఉన్నానని, ఇతర సినిమాలపై ఫోకస్ పెట్టలేకపోయానని చెప్పారు ఎంఎస్ రాజు. ఈ సందర్బంగా ఆయన హాట్ కామెంట్ చేశారు. వీక్ మైండ్ ఉన్న వాళ్లు సినిమాల్లో సెట్ కారు అని, అసలు రాకూడదని చెప్పారు.
వీక్ మైండ్ ఉన్న వాళ్లు సినిమాల్లో సెట్ కారు
`రాజకీయాల్లో ఒక్క సారి సీఎంగా ఓడిపోతే ఐదేళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకసారి ఓడిపోయిన వాళ్లు ఐదేళ్లు, పదేళ్లు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ సీఎం అవుతారు. సినిమాల్లో కూడా అంతే, హిట్ వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి. పరాజయాలు వస్తున్నాయని ఆగిపోకూడదని, తమ బెస్ట్ ఇస్తూనే ఉండాలి, తమ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి, హిట్ వచ్చేంత వరకు పోరాడుతూనే ఉండాలి. అంత ఓపిక లేకపోతే కష్టం. ముఖ్యంగా వీక్ మైండ్ ఉండకూడదు. అలా ఉంటే ఇందులో రాణించడం కష్టం. ఈ విషయంలో ఎవరికైనా తాను చెప్పేది ఇదే` అని వెల్లడించారు ఎంఎస్ రాజు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్గా మారాయి.
అగథ మూవీతో రాబోతున్న ఎంఎస్ రాజు
ప్రస్తుతం ఎంఎస్ రాజు `అగథ` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటిస్తోన్న చిత్రమిది. ఆమె పాత్ర ప్రధానంగానే సినిమా సాగుతుంది. మిస్టరీ డివైన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు ఎంఎస్ రాజు కావడం విశేషం. దీన్ని వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

