Tilak Varma: నేను ఆడేది దేశం కోసం.. విమర్శకులకు తిలక్ వర్మ మాస్ కౌంటర్
Tilak Varma: జింబాబ్వే సిరీస్కు ముందు తన స్లో బ్యాటింగ్పై వచ్చిన విమర్శలపై టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను దేశం కోసం ఆడుతున్నాననీ, జట్టు పరిస్థితులే ముఖ్యమని వెల్లడించాడు.

తొలి బంతికే సిక్స్ కొట్టాలా? స్లో బ్యాటింగ్ ట్రోల్స్పై తిలక్ వర్మ ఫైర్
జూలై 23 నుంచి భారత్, జింబాబ్వే మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ముఖ్యమైన సిరీస్ మొదలయ్యే ముందు టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన స్లో బ్యాటింగ్పై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో తన బ్యాటింగ్ శైలి నెమ్మదిగా ఉండటానికి గల అసలు కారణాలను ఆయన స్పష్టం చేశారు. క్రీజులోకి రాగానే తొలి బంతి నుంచే సిక్సర్లు కొట్టడం సాధ్యం కాదని చెప్పారు.
యూకే పర్యటనలో నిరాశపరిచిన ఫలితాలు
ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో రన్స్ చేసినప్పటికీ, స్పిన్నర్ల ఎదుట తిలక్ వర్మ ఇబ్బంది పడ్డారని, నెమ్మదిగా ఆడారని విమర్శలు వచ్చాయి. యుకే పర్యటనలో భారత్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన భారత్ ఐర్లాండ్తో 0-2, ఇంగ్లాండ్తో 0-4 తేడాతో సిరీస్లను కోల్పోయింది. మొత్తం 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో ఓడిపోగా, ఒక్కటి వర్షం వల్ల రద్దయింది.
జాతీయ జట్టు బాధ్యతలపై స్పష్టత
జింబాబ్వే సిరీస్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తిలక్ వర్మ తన శైలిని సమర్థించుకున్నారు. "ఈ గేమ్లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. కష్టమైన పరిస్థితుల్లో అది అంత తేలిక కాదు. జట్టుకు నేను క్రీజులో నిలదొక్కుకోవడం అవసరమైతే అదే చేస్తాను. ఒకవేళ మొదటి బంతి నుంచే అటాకింగ్ ఆడాలని మేనేజ్మెంట్ కోరితే దానికి కూడా సిద్ధంగా ఉంటాను" అని అన్నారు.
ప్రతికూల పరిస్థితుల్లో వ్యూహాత్మక ఆట
యూకే పర్యటనలో ఎదురైన సవాళ్లను తిలక్ గుర్తుచేసుకున్నారు. "ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్ వరకు మా జట్టు 4 లేదా 5 వికెట్లను పవర్ప్లేలోనే లేదా తొలి 10 ఓవర్లలోనే కోల్పోయింది. అటువంటి సమయంలో క్రీజులోకి వెళ్లి వేగంగా రన్స్ చేసే క్రమంలో వికెట్ పారేసుకోవడం తెలివైన పని కాదు. నేను నా దేశం కోసం ఆడుతున్నాను. నాపై చాలా బాధ్యతలు ఉన్నాయి. వైస్ కెప్టెన్గా ఉన్నప్పుడు జట్టు పరిస్థితిని బట్టే ఆడాలి" అని వివరించారు.
జింబాబ్వే సిరీస్పై ధీమా
జింబాబ్వే సిరీస్ పట్ల తిలక్ వర్మ చాలా పాజిటివ్గా ఉన్నారు. ఈ యూకే పర్యటనలో తిలక్ వర్మ మొత్తం 7 మ్యాచ్లు ఆడి 178 రన్స్ చేశారు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెల్ఫాస్ట్లో ఐర్లాండ్పై చేసిన 55 రన్స్ ఆయన అత్యధిక స్కోరు. "గత పర్యటన నుంచి మేం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మా బేసిక్స్ మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాం. టీమ్లో అందరూ డొమెస్టిక్, 'ఎ' సిరీస్ క్రికెట్ బాగా ఆడారు, కాబట్టి పెద్ద స్టేజ్ లపై రాణించడానికి రెడీగా ఉన్నారు" అని తిలక్ వర్మ ధీమా వ్యక్తం చేశారు.

