Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Team India: ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్కు భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో భారత లెజెండరీ ప్లేయర్లు రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులకు చోటు దక్కింది.

ఆస్ట్రేలియాతో సిరీస్కు భారత్ అండర్-19 జట్టులో ద్రావిడ్, సెహ్వాగ్ కుమారులు
టీమిండియా మాజీ దిగ్గజాలు రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ మైదానంలో కలిసి సృష్టించిన రికార్డులు అభిమానులకు ఇప్పటికీ గుర్తే. వీరు చివరగా జనవరి 2012లో అడిలైడ్లో ఆస్ట్రేలియాపై కలిసి టెస్టు మ్యాచ్ ఆడారు. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత, ఇప్పుడు మళ్లీ వారి పేర్లు ఒకే టీమ్ షీట్లో కనిపించబోతున్నాయి. అయితే ఈసారి తండ్రులు కాదు, వారి కుమారులు భారత అండర్-19 జట్టు తరఫున మైదానంలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగబోయే స్వదేశీ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ పురుషుల సెలక్షన్ కమిటీ ప్రకటించిన భారత్ అండర్-19 జట్టులో వీరికి చోటు లభించింది.
ఆర్యవీర్, అన్వయ్ అరంగేట్రం
మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రావిడ్ వికెట్ కీపర్ బ్యాటర్గా జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు. గతనెల జులైలో జరిగిన శ్రీలంక పర్యటనలోనూ అన్వయ్ ఆడాడు. అక్కడ రెండో వన్డేలో 87 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. మరోవైపు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్కు జాతీయ అండర్-19 జట్టు నుండి ఇదే తొలి పిలుపు. 18 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యవీర్, ప్రస్తుతం దిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో వెస్ట్ దిల్లీ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. అంతకుముందు 2024 కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై 297 రన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
కెప్టెన్గా లక్ష్య రాయ్చందానీ
ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్కు ఉత్తరాఖండ్ ఆటగాడు లక్ష్య రాయ్చందానీ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. యష్వర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్గా ఉంటాడు. ఆ తర్వాత జరిగే మల్టీ-డే మ్యాచ్లకు వీరిద్దరి బాధ్యతలు మారుతాయి. యష్వర్ధన్ కెప్టెన్గా, లక్ష్య వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఈ సిరీస్లోని మూడు వన్డేలు సెప్టెంబర్ 18, 21, 23 తేదీల్లో రాజ్కోట్లో జరుగుతాయి. మొదటి మల్టీ-డే మ్యాచ్ సెప్టెంబర్ 27 నుండి 30 వరకు రాజ్కోట్లో, రెండో మల్టీ-డే మ్యాచ్ అక్టోబర్ 5 నుండి 8 వరకు అహ్మదాబాద్లో జరగనున్నాయి. అన్వయ్, ఆర్యవీర్ ఇద్దరూ కేవలం వన్డే జట్టుకు మాత్రమే ఎంపికయ్యారు.
శ్రీలంక టూర్లో మెరిసిన యువ సంచలనాలు
ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో లక్ష్య రాయ్చందానీ అద్భుత ఫామ్ చాటాడు. రెండు మ్యాచ్ల ఫోర్-డే సిరీస్లో 153.50 సగటుతో 307 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో గాలెలో చేసిన 207 రన్స్, కొలంబోలో చేసిన నాటౌట్ 100 రన్స్ ఉన్నాయి. అతనితో పాటు సాగర్ వీర్క్ (134), మణల్ చౌహాన్ (150), కుశాగ్ర ఓజా (111) సెంచరీలతో రాణించారు. బౌలింగ్లో లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్ 6 వికెట్లు, ఫాస్ట్ బౌలర్లు చిగురుపాటి వెంకట, ప్రణవ్ రాఘవేంద్ర చెరో 5 వికెట్లతో మెరిశారు. వికెట్ కీపింగ్ ఆప్షన్లుగా రజత్ బఘేల్ వన్డేలకు, మానవ్ కృష్ణ, అభిప్రాయ్ బిస్వాస్ మల్టీ-డే మ్యాచ్లకు ఎంపికయ్యారు.
భారత అండర్-19 పూర్తి జట్లు
వన్డే జట్టు: లక్ష్య రాయ్చందానీ (కెప్టెన్), యష్వర్ధన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ బఘేల్ (వికెట్ కీపర్), ఆర్యవీర్ సెహ్వాగ్, వి.కె. వినీత్, కుశాగ్ర ఓజా, అర్జున్ రాజ్పుత్, మణల్ చౌహాన్, అన్వయ్ ద్రావిడ్ (వికెట్ కీపర్), వి. యష్వీర్, రోహిత్ యాదవ్, షవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, పటేల్.
మల్టీ-డే జట్టు: యష్వర్ధన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్చందానీ (వైస్ కెప్టెన్), సాగర్ వీర్క్, కుశాగ్ర ఓజా, మణల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), అభిప్రాయ్ బిస్వాస్ (వికెట్ కీపర్), రోహిత్ యాదవ్, ఇషాన్ ఓమ్, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాంశు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్.

