- Home
- Andhra Pradesh
- Highest temperature : వరల్డ్ రికార్డుకు చేరువలో తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు.. అత్యధికం ఎక్కడ, ఎంతో తెలుసా?
Highest temperature : వరల్డ్ రికార్డుకు చేరువలో తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు.. అత్యధికం ఎక్కడ, ఎంతో తెలుసా?
Heat Wave Alert : తెలుగు రాష్ట్రాలపై సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఎండలు మండిపోతున్నాయి. వరల్డ్ రికార్డులు బద్దలయ్యే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఇవేం ఎండల్రా నాయనా..!
Highest temperature : ఈ భూమిపై ఇప్పటివరకు నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతలు 56.7 డిగ్రీ సెల్సియస్.. అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ డెత్ వ్యాలీ ప్రాంతంలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇండియాలో అయితే రాజస్థాన్ లోని పలోడి ప్రాంతంలో నమోదైన 51 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలే అత్యధికం. అయితే ఈ రికార్డులను బద్దలుగొట్టేలా తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి... భానుడి భగభగలకు అనేక ప్రాంతాలు అగ్నిగుండాల్లా మారాయి.
ఇప్పటికే ఎండలు మాడు పగలగొట్టేలా కాస్తున్నాయి... అయితే రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత కంగారు పెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత, వడగాలులు తెలుగు ప్రజలను సతమతం చేస్తున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కేవలం మే 21 (గురువారం) ఒక్కరోజే తెలంగాణవ్యాప్తంగా 22 మంది వడదెబ్బతో ప్రాణాలు వదిలారు. దీంతో రాబోయే వారం పదిరోజులు పగటిపూట ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు...
ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు తారాస్థాయికి చేరాయి... మిట్టమధ్యాహ్నం స్యూర్యుడు నడినెత్తిపైకి వచ్చి నిప్పులు కురిపిస్తున్నాడు. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే ఇండియాలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలకంటే కేవలం 3 డిగ్రీలే తక్కువ.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1, మార్కాపురం జిల్లా నందనమారెల్లులో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక బాపట్లలో జిల్లా వేటపాలెంలో 47.6, కృష్ణా జిల్లా నందివాడలో 47.6, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 47.4, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3, మార్కాపురం జిల్లా నందనమారెల్లులో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా, 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తెలంగాణలో మండుటెండలు..
తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి... రోహిణి కార్తె కంటే ముందే రోకళ్లు పగిలే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ (మే 22, శుక్రవారం) అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది... ఉదయంపూట అత్యల్పంగా నల్గొండ జిల్లాలో 26 డిగ్రీలు నమోదయ్యాయి.
జిల్లావారిగా చూసుకుంటే నిజామాబాద్ లో 44.9, ఆదిలాబాద్ లో 44.8, హన్మకొండ 44.5, రామగుండంలో 44.3, భద్రాచలంలో 44.2 డిగ్రీల హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. కేవలం ఈ జిల్లాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా మిగతా జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉన్నాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో కూడా మామూలు ఎండలు కాయడం లేదు... దీంతో వడగాలులు, ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాజేంద్ర నగర్ లో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక బేగంపేటలో 43, హయత్ నగర్ లో 42, హకీంపేటలో 42.6, పటాన్ చెరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి.
Daily weather PPT of Telangana dated 22.05.2026 pic.twitter.com/1pRsImVFbL
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 22, 2026
మే 23న ఈ జిల్లాల్లో నిప్పుల కుంపటే...
మే 23 (శనివారం) అంటే రేపు తెలంగాణలో మండుటెండలు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. వడగాల్పులు వీచే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మధ్యాహ్నం సమయంలో ఎండలు మండిపోయినా సాయంత్రం వర్షాలతో వాతావరణ కాస్త చల్లబడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇలా ఎండలు, వడగాలులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో ప్రమాదం పొంచివున్న జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.
7- day forecast(mid day) of Telangana Based on 0300 UTC issued at 1300 Hours IST dated : 22.05.2026@TelanganaCS@DCsofIndia@IASassociation@TelanganaDGP@TelanganaCMO@GHMCOnline@HYDTP@IasTelangana@tg_weather@CommissionrGHMC@Comm_HYDRAA@Indiametdeptpic.twitter.com/T8SysGpg8C
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) May 22, 2026

