- Home
- Andhra Pradesh
- Corona Virus Alert : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం.. ఈ లక్షణాలుంటే బిఅలర్ట్, వెంటనే చెకప్ చేయించుకొండి
Corona Virus Alert : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం.. ఈ లక్షణాలుంటే బిఅలర్ట్, వెంటనే చెకప్ చేయించుకొండి
తెలుగు ప్రజలను మరోసారి కరోనా కలవరపెడుతోంది. ఈ మహమ్మారి సరికొత్త రూపంలో ఆంధ్ర ప్రదేశ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకూ కొత్తగా బైటపడ్డ ఈ వేరియంట్ ఏది? దీని లక్షణాలేంటి? ఇక్కడ తెలుసుకుందాం.

ఏపీలో కరోనా కేసులు
Covid-19 : కరోనా వైరస్... ఈ పేరు వింటేచాలు యావత్ ప్రపంచమే వణికిపోతుంది. ఈ మహమ్మారి వైరస్ ఎన్నో ప్రాణాలను బలితీసుకోవడమే కాదు పలు దేశాలను పూర్తిగా స్తంభింపజేసింది. ఇలా ఇండియా కూడా పూర్తిగా లాక్ డౌన్ విధించడం, ప్రజలను క్వారంటైన్ చేయడం చేసింది… ఒకటి రెండ్రోజులు కాదు నెలలు, సంవత్సరాలపాటు కరోనా విలయతాండవం చేసింది. తెలుగు రాష్ట్రాలు (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) కూడా ఈ మహమ్మారి బారినపడి విలవిల్లాడాయి. ఇప్పుడిప్పుడే కరోనాను మరిచి ప్రజలు సాధారణ జీవితం సాగిస్తున్నారు... ఇలాంటి సమయంలో ఈ మహమ్మారి మరో కొత్తరూపంలో అటాక్ చేస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు
కరోనా వైరస్ జన్యూమార్పులు చేసుకుంటూ కొత్తకొత్త రూపాల్లో ప్రజలపై అటాక్ చేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ 'RF.5'ఆందోళన కలిగిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియంట్ కేసులు ఆంధ్ర ప్రదేశ్ లో బైటపడుతున్నాయి... దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఇటీవల కడప జిల్లాలో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. వీరినుండి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నుండి వచ్చిన తాజా రిపోర్ట్స్ ప్రకారం ఆ నలుగురిలో ఒమిక్రాన్ RF.5 (Omicron RF.5) సబ్-వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో కూటమి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది... ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారికంగా కేసులు బైటపడ్డాయని ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేసుల తీవ్రత, వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఏమిటీ ఒమిక్రాన్ RF.5 వేరియంట్?
RF.5 అనేది ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఒక సబ్-వేరియంట్. ఇది రెండు వేర్వేరు వేరియంట్లు కలవడం వల్ల ఏర్పడినది కాదు... సహజ సిద్ధమైన జన్యు మార్పిడి (Mutation) ప్రక్రియలోనే ఏర్పడింది. JN.1 వేరియంట్ నుండి LF.7గా, ఆ తర్వాత PY.1.1.1 రూపాంతరం చెంది ఆఖరుగా RF.5 వేరియంట్గా మారిందని చెబుతున్నారు.
అత్యధికంగా కేరళలో 115 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదవడం కలవరపెడుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇప్పటివరకు 16 కరోనా కేసులు నమోదవగా ఇందులో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ RF.5 కూడా ఉన్నాయి.
కేవలం కరోనా కేసులు నమోదవడమే కాదు మరణాలు సంభవిస్తుండటం ఆందోళనను మరింత పెంచుతోంది. ఏపీలో కరోనా కారణంగా నలుగురు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు... వీరందరికి ఓమిక్రాన్ RF.5 పాజిటివ్ గా తేలింది.
ఒమిక్రాన్ RF.5 ప్రధాన లక్షణాలు ఇవే
ఈ కొత్త వేరియంట్ RF.5 లక్షణాలు కూడా సాధారణ ఒమిక్రాన్ సబ్-వేరియంట్లను పోలి ఉంటాయి.
జ్వరం, తీవ్రమైన తలనొప్పి
గొంతు నొప్పి లేదా గొంతులో గరగర
పొడి దగ్గు
ఒళ్లు నొప్పులు, నీరసం, అలసట
ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.
వైరస్ సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తలు
మాస్క్ ధరించడం : రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆసుపత్రులకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. గతంలో కరోనా వ్యాప్తి సమయంలో మాదిరిగా జాగ్రత్తలు పాటించాలి.
లక్షణాల పట్ల అప్రమత్తత : జ్వరం లేదా దగ్గు ఉన్నవారు స్వయంగా ఐసోలేషన్లో ఉండటం మంచిది.
వ్యక్తిగత పరిశుభ్రత : తరచుగా చేతులను సబ్బు లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి.
స్వయం వైద్యం వద్దు : లక్షణాలు కనిపించగానే సొంతంగా మందులు వాడకుండా, డాక్టర్ సలహా మేరకే చికిత్స పొందేలా చూసుకోవాలి.

