డైరెక్టర్ ఏమి చెబితే అది చేశాం... ఆచార్య విషయంలో నా బాధ అదే
ఏమాత్రం వీలు చిక్కినా దర్శకుడు కొరటాల శివను వదలడం లేదు బాసు. వెనకాముందు చూడకుండా ఏకిపారేస్తున్నారు. నేరుగానే తన అసహనం ప్రదర్శిస్తున్నారు. తాజాగా మరోసారి కొరటాలపై చిరు విమర్శలు గుప్పించారు.
ఆచార్య ఫెయిల్యూర్ బాధ్యత పూర్తిగా దర్శకుడు కొరటాల శివదే అంటారు చిరంజీవి. ఆ మూవీ ఆల్ టైం డిజాస్టర్ కాగా చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఈ క్రమంలో చిరంజీవి సమయం సందర్భం లేకుండా దర్శకుడు కొరటాల శివపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆచార్య ఫెయిల్యూర్ పై చిరంజీవి స్పందించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొరటాల శివ తప్పు చేశాడన్న భావన వెల్లడించారు. తాజాగా మరోసారి చిరంజీవి కొరటాల శివను టార్గెట్ చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.... ఆచార్య ఫెయిల్యూర్ నాపై ఎలాంటి ప్రభావం చూపదు. ఆచార్య సినిమా దర్శకుడు ఎంపిక, ఆయన ఏం చెప్పారో మేము అదే చేశాం. నాకు లాగే చరణ్ పై కూడా ఆచార్య ఫెయిల్యూర్ ప్రభావం చూపించదు. ఒక సినిమా ఫలితం తన చేతుల్లో ఉండదని చరణ్ కి తెలుసు. ఆచార్య మూవీ విషయంలో బాధపడే విషయం ఏంటంటే,అది చరణ్ నేను కలిసి చేసిన మల్టీస్టారర్. భవిష్యత్తులో మేము ఎప్పుడు కలిసి మల్టీస్టారర్ చేసినా ఆ థ్రిల్ అనేది మిస్ అవుతాం, అన్నారు.
ఇక్కడ దర్శకుడు ఏం చెబితే అది చేశామన్న చిరంజీవి, మొత్తం కొరటాల మీదకు నెట్టేశాడు. అలాగే ఆచార్య ఫెయిల్యూర్ చరణ్, తనను ఎఫెక్ట్ చేయదని చెప్పుకొచ్చాడు. నిజంగా ఆచార్య రిజల్ట్ ఎక్కువగా ఇబ్బంది పెట్టింది కొరటాల శివనే. ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చిన కొరటాల ఆస్తులు పోగొట్టుకున్నాడు. బయ్యర్లకు ఆయన నష్టాలు పూడ్చాల్సి వచ్చింది.
40 ఏళ్ల కెరీర్ లో చిరంజీవి ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎన్నో చూశారు. ఆచార్య విషయంలో మాత్రం ఆయన డైరెక్టర్ ని టార్గెట్ చేయడం వెనుక కారణం ఏమిటో తెలియడం లేదు. కొరటాల మీద చిరంజీవి చాలా కోపంగా ఉన్నారన్నది స్పష్టంగా అర్థం అవుతుంది. డిజాస్టర్ కావడానికి మించి బయ్యర్లతో ఏర్పడిన వివాదాలు చిరును ఆగ్రహానికి గురి చేసి ఉండవచ్చు. వాళ్ళు టెంట్స్ వేసి ధర్నాలు చేశారు. ఏది ఏమైనా ఆచార్యతో సర్వం కోల్పోయిన కొరటాలను పదే పదే విమర్శించడం సమంజసంగా లేదు. కాగా చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న విడుదల కానుంది.