IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ 1 మంగళవారం అంటే మార్చి 4న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డుల గురించి తెలుసుకుందాం.
IND vs AUS సెమీ-ఫైనల్ దుబాయ్ పిచ్ రిపోర్ట్: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి సెమీఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. మార్చి 4, మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఫైనల్ కు చేరుకుంటుంది. రెండు టీమ్స్ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. భారత్-ఆసీస్ జట్లు ఐసీసీ సెమీ ఫైనల్స్లో తలపడడం ఇది మూడోసారి. ఈ టోర్నమెంట్లో రెండు జట్లు అద్భుతంగా రాణించాయి. భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ చేరుకుంది. ఆస్ట్రేలియా అద్భుతమైన ఆటతో టోర్నీని ప్రారంభించింది. భారత్ పై అద్భుతమైన రికార్డులు ఉన్న కంగారు టీమ్ గెలుపు ధీమాతో ఉంది. అయితే, సెమీఫైనల్లో గెలిచి, వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో దుబాయ్ పిచ్ ఎలా ఉండనుంది?
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గత 5 వన్డే మ్యాచ్లను పరిశీలిస్తే, ఇక్కడ మొదట బౌలింగ్ చేసిన జట్టు 60 శాతం మ్యాచ్ల్లో గెలిచింది. లక్ష్యాన్ని ఛేదించే జట్లు 40 శాతం విజయాలు సాధించాయి. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 231 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో ఇది 222 అవుతుంది. చివరి మ్యాచ్లో భారత జట్టు ఇక్కడే న్యూజిలాండ్తో ఆడింది, ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 44 పరుగుల తేడాతో కీవీస్ పై గెలిచింది. ఈ మైదానంలో స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. గత 5 మ్యాచ్ల్లో స్పిన్ బౌలింగ్కు 66 వికెట్లు దక్కాయి. భారత్కు నలుగురు టాప్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు, వీరు ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించగలరు. కాబట్టి ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటనుంది. ఆసీస్ బ్యాటింగ్.. భారత స్పిన్ బౌలింగ్ క్రికెట్ లవర్స్ కు మజాను అందించడం పక్కా.
భారత్, ఆస్ట్రేలియా మధ్య గత 10 వన్డే మ్యాచ్ల ఫలితాలు ఏంటి?
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన గత 10 వన్డే మ్యాచ్లను గమనిస్తే.. ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఇండియా 5 మ్యాచ్ల్లో గెలిచింది, ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల్లో గెలిచింది. చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో రెండు జట్లు తలపడ్డాయి. ఇక్కడ భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పెద్ద మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుంది. కాబట్టి, ఈ సెమీఫైనల్లో కూడా టీమ్ ఇండియాకు చాలా పెద్ద సవాలు ఎదురుకానుంది. అయితే, ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్లో మొదటిసారిగా దుబాయ్లో ఆడనుంది, భారత్ ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడింది. దీని వల్ల రోహిత్ సేనకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. దీనికి తోడు భారత జట్టులోని బ్యాటర్లు, బౌలర్లు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉండటం రోహిత్ సేనకు కలిసివచ్చే అంశం.