కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు.. ఇబ్బందులివే : కేంద్రానికి యనమల రామకృష్ణుడు లేఖ
కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ కార్యదర్శికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. కాకినాడలో కేంద్రం ఏర్పాటు చేయదలచిన బల్క్ డ్రగ్ పార్క్పై ఆయన అభ్యంతరం తెలిపారు.
కాకినాడలో కేంద్రం ఏర్పాటు చేయదలచిన బల్క్ డ్రగ్ పార్క్పై అభ్యంతరం తెలిపారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఈ మేరకు గురువారం కేంద్ర ఎరువులు, రసాయనాలు శాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. ఇక్కడ సెజ్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వ 8,500 ఎకరాల భూమిని సేకరించిందని యనమల ప్రస్తావించారు. అలాగే మత్స్యకారుల ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తామని వైఎస్ హామీ ఇచ్చారని రామకృష్ణుడు పేర్కొన్నారు.
కానీ అందుకు విరుద్ధంగా సీఎం జగన్ అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్తో ఫార్మా పార్క్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని యనమల ఆరోపించారు. దీని వల్ల నేల, నీరు, నింగీ, సముద్రం కలుషితమై.. మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. ఫార్మా పార్క్ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారని రామకృష్ణుడు లేఖలో పేర్కొన్నారు.
Also REad:నేతి బీరకాయలో నెయ్యిలాగే ఆయన మాటలు : జగన్పై యనమల రామకృష్ణుడు విమర్శలు
ఇకపోతే... గత నెలలో యనమల మాట్లాడుతూ సీఎం జగన్పై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి పబ్లిసిటీకి వున్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదన్నారు. జగన్ మాటలు చూస్తే నేతి బీరకాయలో నెయ్యి చందంగా వుంటాయని యనమల ఎద్దేవా చేశారు. జగన్ అంటోన్న సామాజిక న్యాయం పచ్చి బూటకమని.. ఇందులో చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతి సంక్షేమ పథకానికి రకరకాల నిబంధనలు పెట్టి.. ఇప్పటికే లక్షలాది మందిని తొలగించారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ మూడేళ్లలో సామాజిక న్యాయం కోసం జగన్ ఏం చేశారో చెప్పాలని మాజీ ఆర్ధిక మంత్రి డిమాండ్ చేశారు.