చంద్రబాబుపై ఆనాడు అలా.. ఈనాడు ఇలా.. ప్రధాని మోడీపై సీఎం జగన్ దాడి..
CM YS Jagan: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ పాలనపై ఆరోపణలు చేస్తూ.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడాన్ని తప్పుబడుతూ ప్రధాని మోడీకి సీఎం జగన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
CM YS Jagan: ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రచారం ముగుస్తుండటంతో పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి తరుఫున ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో అధికార వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీకి అధికారం అప్పగిస్తే.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, రాష్ట్రం అవినీతిలో ఉందని విమర్శించారు.
తాజాగా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ పాలనపై ఆరోపణలు చేస్తూ.. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడాన్ని తప్పుబడుతూ ప్రధాని మోడీకి సీఎం జగన్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
గత ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాని మోడీ ఏమన్నారో గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏమంటున్నారో ప్రజలే ఆలోచించాలని ఘాటు వ్యాఖ్యలు చేసారు. 2014-19 మధ్య బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు ఆ తరువాత కూటమి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో చంద్రబాబును మోసగాడని ప్రధాని మోడీ ఆరోపించారనీ, పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, పోలవరాన్ని మంటగలిపారని, అక్కడ ఎలాంటి అభివృద్ధి లేనేలేదని, కొడుకు కోసమే తప్ప ప్రజలకోసం చంద్రబాబు రాజకీయం చేయడం లేదని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు.
ఆనాడు అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ప్రధాని మోడీ.. ఇప్పుడు ఎన్డీయే గూటికి వచ్చాడని ఆక్షేపించారు. అదే చంద్రబాబు.. ఇప్పుడు నీతిమంతుడు అయ్యారా ? వీరుడు సూరుడు అయ్యారా ? మరి ఏమి మార్పు గుర్తించి ఆయన్ను మళ్ళీ నెత్తికి ఎత్తుకుని మోస్తున్నారని జగన్ ప్రశ్నలు సంధించారు.
మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే.. అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారనీ, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తిని అమ్మేస్తుంటే తాము చూస్తూ ఊరుకుంటామా? అన్ని ప్రశ్నించారు. ప్రజలు కానీ ఎన్డీయేకు ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఒప్పుకున్నట్లేననీ, తాము అధికారంలో ఉన్నాం కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిందని అన్నారు.
లేకుంటే ఎప్పుడో కాలం గర్బంలో కలిసేందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన మోసగాడు బాబును ఎందుకు గెలిపించాలనీ, అలాంటి చంద్రబాబుకు బీజేపీ ఎందుకు సపోర్టు చేస్తుందని, ఆయనకు ఎందుకువత్తాసుపలుకుతున్నారంటూ మోడీపై జగన్ ప్రశ్నల వర్షం కురించారు. స్వార్థ రాజకీయాల కోసం ఎవరు ఏ స్థాయికి దిగజారిపోయారో దీన్ని బట్టే ప్రజలు ఆలోచించుకోవాలని సీఎం జగన్ కోరారు.