ఉత్తరాది నేతల మెడలు వంచాల్సిందే నని ప్రత్యేక హోదా కు  యాంటినార్త్ సెంటిమెంట్ పులుముతున్న పవన్ కల్యాణ్

ఈ మధ్య కేవలం నినాదం, డిమాండ్ స్థాయికి పడిపోయిన ప్రత్యేక హోదా ఇపుడు మళ్లీ ఒక రాజకీయ కార్యక్రమం అయికూచుంది. ఈ సారి ఈ డిమాండ్ కు ఉత్తర భారత వ్యతరేక సెంటిమెంట్ కూడా తోడవుతూ ఉంది. ఇంతవరకు ఇది కేవలం రాష్ట్ర రాజకీయ డిమాండ్ గానే ఉండింది. అయితే, జన సేన నేత పవన్ కల్యాణ్ దీనికి కొత్త వివరణ ఇస్తున్నారు. ప్రత్యేక హోదాను తిరస్కరించడానికి, ఉత్తర భారత్ ఆధిపత్య రాజకీయాలే కారణమంటున్నారు. ఇది కొత్త కోణం. పవన్ రాజకీయ ఉద్యమం ఉత్తరభారత వ్యతిరేక మలుపు తిరిగేలా ఉంది.

గతంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చిన తమిళులకు భాషా ప్రాంతీయ గుర్తింపు తెచ్చింది. హిందీవ్యతిరేకత తమిళుల ఐక్యత కు బాట వేసింది. ఇపుడు పవన్ యాంటినార్త్ సెంటిమెంట్ ముందుకు తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వక పోవడానికి కారణం, ఉత్తరాది పెత్తందారీతనమే అంటున్నారు. ఉత్తరాది నేతలు దక్షిణాది నేతలను కించపరస్తున్నారని, ఇది మానుకొనకపోతే, మెడలు వంచుతామని ఈ రోజు ఆయన ట్విట్టరెక్కి ప్రకటించారు.

ఇది జనసేన నాయకుడి ముప్పేట దాడి. ప్రకటనలిస్తున్నారు. ట్విట్టరెక్కి మాట్లాడుతున్నారు. పర్యటనలకు పూనుకుంటున్నారు. అన్నీ ఉత్తరభారత ’కేంద్రా‘నికి వ్యతిరేకమే.

ఒక వైపు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహ న్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఫల్యంగా జగన్ విమర్శిస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి దక్షిణ భారత దేశం పట్ల చిన్నచూపు దీనికి కారణం అంటూ యాంటినార్త్ సెంటిమెంట్ స్థాయికి తీసుకువస్తున్నారు. ఈనెల 26 న వైజాగ్ నిరసన తో ప్రత్యేక హోదా సమస్య ఈ ఒక నినాద రూపం తీసుకునే అవకాశం ఉంది.

జల్లికట్టులో తమిళనాయకులు చూపిన ఐక్యత నేపథ్యంలో ఆయన ఈ రోజు ‘ ఆంధ్ర రాజకీయ నాయకులకు దమ్ము ఆత్మాభిమానం, అంకితభావం, జవాబుదారీ తనం లోపించాయి,’ అని తీవ్రమయిన విమర్శ చేశారు.దేశాన్ని పాలించే ఉత్తర భారత నేత లమీద కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు.

‘ఈ నార్త్ ఇండియా నాయకులకు, సౌత్ లో ఎన్ని భాషలున్నాయో తెలుసా? వాళ్లకి మనమంతా మదరాసీల్లా కనబడుతున్నాం’ అని నిలదీశారు.

“గాంధీని ప్రేమిస్తాం, అంబేద్కర్ని అభిమానిస్తాం. పటేల్ కి దండం పెడతాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం.”

కాని,

 ‘తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పోతే, చూస్తూ కూర్చోంఉత్తర భారత నీచంగా చూడటం, అవమానించడం, వాళ్ల అత్మాభిమానాన్ని దెబ్బతీయం చేస్తే... వాళ్ల పొగరెలా దించాలో మాకూ తెలుసు,’ అని పవన్ చాలా ఘాటుగా విమర్శించారు.

ఆంధ్ర ప్రదేశ్ యువత శాంతియుతంగా తన నిరసన తెలిపడమే ప్రత్యేక హోదా సాధనకు పరిష్కారం అని ఆయన సూచించారు.