సిఎం అయ్యేదాకా వెళ్లనంటే ఎలా: జగన్ కు పవన్ కల్యాణ్ ప్రశ్న
గత ఎన్నికల్లో పోటీ చేయనందుకు తనను క్షమించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతులెత్తి ప్రజలవకు దండం పెట్టారు.
శ్రీకాకుళం: గత ఎన్నికల్లో పోటీ చేయనందుకు తనను క్షమించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతులెత్తి ప్రజలవకు దండం పెట్టారు. ప్రత్యేక హోదా సాధన కోసం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిరసన కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తాను ఏది మాట్లాడినా పవన్ కు రాజకీయాలు తెలియవు, కొత్తవాడు అని కొందరు ఉద్ధండ పండితుల్లాగా, అఖండ జ్ఞానుల్లాగా, అపారమైన అనుభవం ఉన్న వ్యక్తుల్గాగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రజలను వంచించడంలో వారికి అపారమైన అనుభవం ఉందని తాను అంగీకరిస్తానని అన్నారు.
జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టి రూ. 74వేల కోట్ల లెక్కకు అంతు లేదని అంతమంది మేధావుల ద్వారా తెలియజేస్తే అప్పుడు దాకా వారు మేలుకోలేదని అన్నారు. అటు ప్రతిపక్షంగానీ, ఇటు అధికారపక్షంగానీ పట్టించుకోలేదని విమర్శించారు.
సమస్యల పోరాడాలంటే వైఎస్సార్ కాంగ్రెసు వాళ్లు అసలు అసెంబ్లీకే వెళ్లరని అంటూ సీఎం అయ్యేదాకా అసెంబ్లీకి వెళ్లకూడదనుకుంటే ఎలా?మస్యలు ఎలా పరిష్కారమవుతాయని పవన్ వైఎస్ జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.
తనకు ఒక ఎమ్మెల్యేగానీ ఎంపీగానీ లేడని, తాను బయటికి వచ్చి ఉద్ధానం గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వం కదిలిందని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయనందుకు ప్రజలు తనను క్షమించాలని ఆయన అన్నారు. చేతులెత్తి దండంపెడుతూ ఆయన క్షమాపణలు కోరారు.
ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ విషయంలో ఎంత గర్వించవచ్చునో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. అలాంటిది తాను పోటీ చేయలేదని, అందుకు ప్రజలను తాను మనస్పూర్తిగా క్షమించాలని అడుగుతున్నానని అన్నారు.
తనకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఉద్దానం సమస్యను పరిష్కరించేవాడినని అన్నారు. అవసరమైతే అసెంబ్లీనే ఆపేసేవాడినని అన్నారు.