బాబూ.. నీ కేసులపై విచారణకు సిద్ధమా?: MLC వరుదు కళ్యాణి | YSRCP | liquor Scam | Asianet News Telugu
సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక, హామీలు అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హామీల అమలు విషయంలో అన్నివర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్నవారిని అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. వైయస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి, మద్యం షాపులు తగ్గించి, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతులిచ్చారని, వైయస్సార్సీపీ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే ఆయనపై నమోదైన కేసులపై విచారణకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు.