)
పిఠాపురంలో వర్మతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ | Janasena | TDP Varma | Asianet News Telugu
కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కలిసి ముందుకు సాగుతామన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం పిఠాపురం ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించే పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పిఠాపురంలో 9 నెలల్లోనే రూ.100 కోట్లపైగా అభివృద్ధి పనులు ప్రారంభించిందని తెలిపారు. "ఎన్నికల ప్రచార సమయంలో పిఠాపురం ప్రజల కోరిక మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీని నెరవేర్చే నిమిత్తం తొమ్మిది నెలల్లోనే రూ.34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. అదే విధంగా నూతనంగా రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషీన్లు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఆసుపత్రిలో నూతనంగా డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, పెథాలజీ విభాగాలు ఏర్పాటు చేసి అందుకు సంబంధించి 66 కొత్త పోస్టులు మంజూరు చేశాం. ఈ ఆసుపత్రి ద్వారా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని 3 లక్షల మంది ప్రజలతోపాటు చుట్టు పక్కల ఆరు మండలాల ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మాట నిలుపుకొనే ప్రభుత్వం. గతంలో గొల్లప్రోలు సభలో ఇచ్చిన హామీ మేరకు, నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకొనేందుకు వీలుగా రూ.2 కోట్ల అంచనా వ్యయంతో టిటిడి కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశాము. నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ కళ్యాణ మండపం ద్వారా చుట్టు పక్కల గ్రామాలలో సుమారు పది వేల కుటుంబాలకు అతి తక్కువ రుసుముతో వివాహాది శుభకార్యాలు చేసుకునే సౌకర్యం లభిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేబ్రోలు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో హరికథలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా రూ. 48 లక్షల అంచనా వ్యయంతో కాలక్షేప మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. గొల్లప్రోలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి రూ . 1 కోటి 32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. దీని ద్వారా దేవాలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి" అని పవన్ కళ్యాణ్ తెలిపారు.