22 దఫాలు గ్యాంగ్ రేప్: గుజరాత్ సర్కార్కు సుప్రీం షాక్
గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. 2002లో చేలరేగిన అల్లర్లలో 22 దఫాలు గ్యాంగ్రేప్కు గురైన బాధితురాలికి రూ. 50 లక్షల పరిహారాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. 2002లో చేలరేగిన అల్లర్లలో 22 దఫాలు గ్యాంగ్రేప్కు గురైన బిల్కిస్ బానోకు రూ. 50 లక్షల పరిహారాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నివాసం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2002 మార్చి 3న గుజరాత్ లోని దహోద్ లోని ఉన్న రంథిక్ పూర్ గ్రామంపై అల్లరి మూకలు దాడిచేశాయి. గోద్రా రైలు దహనం అనంతరం పగతో రగిలిపోయిన ఈ అల్లరిమూకలు బిల్కిస్ బానో కుటుంబంపై దాడిచేశాయి.
ఈ సందర్భంగా బానో తల్లి, చెల్లి, కుమార్తె, ఇతర బంధువులను దుండగులు కత్తులతో నరికి చంపారు. 19 ఏళ్లకే గర్భిణిగా ఉన్న బానోను కూడా వారు విడిచిపెట్టలేదు. ఆమెపై 22 సార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ నేపథ్యంలో బానో పోలీసులను ఆశ్రయించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
చివరకు 2004లో ఈ అఘాయిత్యంపై కేసు నమోదయింది. 2017, మే 4న ముంబై హైకోర్టు దోషులను తప్పించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు డాక్టర్లను దోషులుగా తేల్చింది. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడ్డ 11 మందికి ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. అంతకుముందు గుజరాత్ ప్రభుత్వం బానోకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా ఆమె దాన్ని తిరస్కరించారు.