ఎన్సీఈఆర్టీ సర్వేలో షాకింగ్ విషయాలు: ఆన్లైన్ విద్యపై విద్యార్థుల అసంతృప్తి
ముగ్గురు విద్యార్థుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఆన్ లైన్ విద్యా బోధన కష్టంగా ఉందని తేల్చి చెప్పారు. చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్ సబ్జెక్టులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
న్యూఢిల్లీ: ముగ్గురు విద్యార్థుల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఆన్ లైన్ విద్యా బోధన కష్టంగా ఉందని తేల్చి చెప్పారు. చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్ సబ్జెక్టులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ సర్వేపై ఎన్ సీ ఈ ఆర్ టీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇంటర్నెట్ కనెక్టివిటీ సక్రమంగా లేకపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ల్యాప్ టాప్ , సెల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో లేని కారణంగా ఆన్ లైన్ విద్యకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), జవహర్ లాల్ నవోదయ విద్యాలయాలు (ఎన్ వీ ఎస్), సెంట్రల్ బోర్డు స్కూల్స్ విద్యార్థులు, టీచర్లను ఎన్ సీ ఈ ఆర్ టీ సర్వే నిర్వహించింది.
కేవీ స్కూళ్లలోని 9 వేల మందితో సర్వే నిర్వహించారు. వీరిలో 6 శాతం విద్యార్థులు ఆన్ లైన్ విద్యాబోధన భారంగా ఉందని చెప్పారు. మిగిలిన 24 శాతం మంది కష్టంగా ఉందని తేల్చేశారు. మిగిలిన వారంతా ఆన్ లైన్ క్లాసులపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులలో 1 శాతం మంది తరగతుల నిర్వహణ భారంగా ఉందని చెప్పారు. 10 శాతం మంది కష్టంగా ఉన్నట్టుగా చెప్పారు. 30 శాతం మంది భారంగానో, కష్టంగానో తెలిపారు. మిగిలినవారంతా సంతృప్తిని వ్యక్తం చేశారు.
సీబీఎస్ఈలోని 4800 మంది విద్యార్థులను సర్వే చేస్తే 12 శాతం ఆన్ లైన్ క్లాసులను భారంగా చెప్పారు. 26 శాతం కష్టంగా ఉన్నట్టుగా చెప్పారు. సుమారు 35 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్ లైన్ విద్య కష్టమో, భారమని చెప్పారు.
ఇంటర్నెట్ సమస్య ఆన్ లైన్ క్లాసులపై తీవ్రంగా ఉందని తేలింది. సుమారు 27 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు అందుబాటులో లేవని తేలింది.మ్యాథ్స్, సైన్స్ ఆన్ లైన్ లో నేర్చుకోవడం చాలా కష్టంగా ఉందని విద్యార్థులు చెప్పారు.మరో వైపు 17 శాతం విద్యార్థులు భాష నేర్చుకోవడం కూడ కష్టంగా ఉందని తేల్చిచెప్పారు.దాదాపు 36 శాతం విద్యార్థులు అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు, ఇతర పుస్తకాలను వాడుతున్నారని తేలింది.