కరెంట్ షాక్ తో భర్త మృతి.. బతుకుతాడన్న ఆశతో ఆవుపేడలో పాతిపెట్టి...
బంధువులు, కుటుంబ సభ్యులు అంతా కలిసి సమీపంలోని ఓ రైతు ఇంట్లో ఉన్న ఆవు పేడలో యువకుడి మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తర్వాత ఆరు ఏడు గంటల తరువాత బయటకు తీశారు.
చండీగర్ : హర్యానాలోని సిర్సా జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మూఢనమ్మకాలు విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు లాజిక్ లేకుండా నమ్మేస్తారు. ఇక అది ప్రాణాలకు సంబంధించిన విషయం అయితే.. మరీ ఎక్కువగా నమ్మేస్తారు. అలాంటి ఓ మూఢనమ్మకానికి సంబంధించిన ఘటన ఇది.
విద్యుదాఘాతానికి గురై న ఓ యువకుడిని కుటుంబ సభ్యులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్ అతను చనిపోయినట్లు ప్రకటించారు. కానీ యువకుడి కుటుంబసభ్యులు ఆ యువకుడి మరణాన్ని అంగీకరించలేకపోయారు.
అప్పుడే ఎవరో వారికి ఓ పనికిమాలిన సలహా ఇచ్చారు. ఆరు నుంచి ఏడు గంటలపాటు ఆవుపేడలో పాతిపెడితే కరెంట్ షాక్ ప్రభావం తగ్గి యువకుడు బతుకుతాడని చెప్పారు.
దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు అంతా కలిసి సమీపంలోని ఓ రైతు ఇంట్లో ఉన్న ఆవు పేడలో యువకుడి మృతదేహాన్ని పాతిపెట్టారు. ఆ తర్వాత ఆరు ఏడు గంటల తరువాత బయటకు తీశారు. మరి యువకుడు బతికాడా అంటే?
వివరాల్లోకి వెళితే… స్థానిక మండి కలాన్ వలీలోని దేవ్ లీలా పార్కు సమీపంలో 32 ఏళ్ళ జగ్జీత్ సింగ్ నివసిస్తున్నాడు. అతను ఓ ప్రైవేట్ ల్యాబ్ లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం స్నానం చేసి బాత్రూంలోంచి బయటకు వచ్చాడు.
అక్కడే ఉన్న తీగ మీద తడి టవల్ ఆరేశాడు. అయితే ఆ తీగకు కరెంట్ పాస్ అవుతుండడాన్ని గమనించలేదు. అంతే current shock తో అతడు గిలగిలా కొట్టుకున్నాడు. కింద పడిపోయాడు. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అతడిని పరీక్షించిన వైద్యులు మరణించినట్టు దృవీకరించారు. దీంతో dead bodyని ఇంటికి తీసుకువచ్చారు. ఎవరో ఇలా కరెంట్ షాక్ తో చనిపోయిన వారిని Cow dungలో పూడ్చిపెడితే కరెంట్ ప్రభావం తగ్గి బతుకుతారని చెప్పుకొచ్చారు.
అంతేకాదు 6,7 గంటల తరువాత శరీరాన్ని బైటికి తీసి స్వచ్ఛమైన నేతితో మర్దనా చేయాలని కూడా చెప్పారు. అలాగే చేశారు. ఆ సమయంలో శరీరంలో ఏదో చలనం అనిపించేసరికి వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ డాక్టర్లు మాత్రం అతడు చనిపోయి చాలా సేపయిందని చెప్పడంతో.. ఇక ఏమీ చేయలేకపోయారు.
కర్వా చౌద్ నాడు భర్త దీర్ఘాయుష్షు కొరకు పూజ చేసిన భార్య పూజలు ఫలించలేదని బంధువులు, కుటుంబసభ్యులు రోధించడం అందర్నీ కలచి వేసింది.